హుజూర్నగర్,మార్చి 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదికారులను ఆదేశించారు. మంగళవారం హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పవార్తో పాటు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లికార్జున్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేరుచేయాలన్నారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి స్థానికులు సహకరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి కాలనీల్లోని పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నా రు.
అనంతరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించి కిచెన్ షెడ్డు,తాగునీరు, టాయిలెట్లు, వంటశాలను పరిశీలించారు. అనంతరం 6వ తరగతి విద్యార్ధులతో తెలుగు పాఠాలు చదివించారు. అనంతరం విద్యార్ధులకు నోటు బుక్స్,పెన్నులు పంపిణీ చేశారు. స్కూల్ ఆవరణలో శిథిలావస్ధలో ఉన్న తరగతి గదులను పరిశీలించి, దానిని తొలగించి చదును చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ కవిత, ప్రధానోపాధ్యాయుడు నర్సిరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.