ప్రకృతి వైపరీత్యాల నుంచి అధిగమించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు పంటల సాగును ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోహిణి కార్తె పూర్తయ్యేలోపు మొదటి పంట నాట్లు వేసుకోవాలని.. ఇది గతంలో ఉన్నదేనని, కొత్త పద్ధతి కాదని తెలిపారు. తన స్వగ్రామం నాగారంలోని వ్యవసాయ క్షేత్రంలో నారుమడికి సోమవారం తండ్రి రాంచంద్రారెడ్డి, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి విత్తనాలు వెదజల్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘం ప్రతినిధులతో చర్చించి ముందస్తు పంటలు సాగు చేయాలని నిర్ణయానికి వచ్చారన్నారు. ఇప్పటికే కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలతోపాటు నిజామాబాద్ జిల్లా జక్కల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అపోహలు సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రైతాంగంలో చైతన్యం నింపేందుకే తాను ఇలా రంగంలోకి దిగినట్లు చెప్పారు.
నాగారం, జూన్ 4 : పంటల సాగు ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. తద్వారా రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. పంటల సాగును ముందుకు జరుపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రైతాంగంలో చైతన్యానికి మంత్రి జగదీశ్రెడ్డి స్వగ్రామం నాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో తండ్రి రాంచంద్రారెడ్డి, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి ఆదివారం విత్తనాలు వెదజల్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోహిణి కార్తె పూర్తయ్యే లోపు మొదటి పంట నాట్లు వేయాలని రైతులకు సూచించారు.
ఇదేమీ కొత్త పద్ధతి కాదని గతంలో ఉన్నదేనని పేర్కొన్నారు. రెండో పంటపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పడుతుండడంతో సీఎం కేసీఆర్ పాత పద్ధతిని పునరుద్ధరించారని తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘం ప్రతినిధులతో మేథోమదనం చేశాకే ఈ నిర్ణయానికి వచ్చారన్నారు. ఇందులో అపోహాలు సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడెం, నాగార్జునసాగర్ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ జిల్లా జక్కల్లోను ఇదే పద్ధతిలో నాట్లు పెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
సాగును ముందుకు జరపడంతో పంట దిగుబడి పెరగడంతో పాటు రెండో పంట సురక్షితంగా ఇంటికి చేరుతుందన్నారు. అందులో భాగంగానే తాను ముందస్తుగా విత్తనాలు వెదజల్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, నీటి పారుదల అధికారి రమేశ్బాబు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ గుండగాని అంబ య్య, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దోమల బాలమల్లు, నాయకులు చిప్పలపల్లి సోమయ్య, కూరం వెంకన్న, సుధాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ చిప్పలపల్లి రాములు పాల్గొన్నారు.