నీలగిరి, డిసెంబర్ 11 : పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం లక్ష మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టింది. పది ప్రాంతాల్లో సుమారు 1,04,500 మొక్కలను నాటేందుకు మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటే చేశారు. వివిధ శాఖలకు చెందిన 1800 మంది సిబ్బందితోపాటు 45వేల మంది హైస్కూల్ విద్యార్థులు భాగస్వాములు కానున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. కార్యక్రమం విజయవంతానికి కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అన్ని శాఖల సమన్వయంతో..
జిల్లాలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ఒకే రోజు లక్ష మొక్కలు నాటేలా ప్రణాళికలు తయారు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రధానంగా విద్యాశాఖను సమన్వయం చేయనుంది. 8వ తరగతి అపైన చదివే విద్యార్థ్ధులను 45 వేల మందిని కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. వీరు కాకుండా అంగన్వాడీ టీచర్లు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, ఫారెస్టులోని హరితహారం టీమ్లు స్వచ్ఛంద సంస్థ్ధలు జిల్లా, మండల స్థాయి అధికారులు కూడా పెద్ద ఎత్తున పాలుపంచుకోనున్నారు. ప్రధానంగా విద్యాశాఖ, మున్సిపల్, ఫారెస్టు, ఐసీడీఎస్, పంచాయతీ రాజ్ శాఖలు కీలకపాత్ర పోషించనున్నాయి.
ప్రారంభించనున్న మంత్రి జగదీశ్రెడ్డి
హరితహారంలో భాగంగా సోమవారం లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిలతో కలిసి ప్రారంభించనున్నారు. దానితోపాటు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.
ఉదయం 9.30 నిమిషాలకు ఎస్ఎల్బీసీ వద్ద, 10.00 గంటలకు దేవరకొండ రోడ్డులోని సెయింట్ అల్పోన్సెస్ స్కూల్ మౌంట్ ఫోర్డ్ స్కూల్ ఎదురుగా, 10.30 నిమిషాలకు రైల్వే ట్రాక్, లోయర్ రైల్వే ఫ్లైఓవర్, రైల్వే గెస్ట్హౌజ్ వద్ద ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.00 గంటలకు ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం, 10.30 నిమిషాలకు రీజినల్ సైనిక సంక్షేమ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.