యాదాద్రి భువనగిరి, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటంలేదు. గత రెండున్నర ఏండ్లుగా రైతులను హస్తం ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. 24గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్.. సరఫరాలో భారీగా కోతలు విధిస్తున్నది. రోజులో 12గంటల కరెంట్ కూడా అందించకుండా పవర్ కట్ చేస్తున్నది. అందులోనూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంటున్నది. ఫలితంగా అనేక చోట్ల పొట్ట దశలో ఉన్న పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, సార్టర్లు కాలిపోతుండటంతో రైతులకు అదనపు భారం తప్పడంలేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 4లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అయితే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కనీసం 12గంటల నుంచి 14 గంటలు కూడా సరఫరా చేయడం లేదు. తెల్లవారు జామున 4గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే రైతులకు కరెంట్ అందుతున్నది. ఇందులో కూడా మధ్య మధ్యలో కోతలు విధిస్తున్నారు. బ్రేక్డౌన్, లైన్ ఫాల్ట్ తదితర కారణాలతో గంటలు గంటలు కట్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే.. అప్పటి ఎంపీ, ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నానా యాగీ చేశారు. సబ్ స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్లను తనిఖీ చేసి.. కేవలం 18 గంటలు మాత్రమే ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు 12 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నా కిమ్మనడంలేదు.
ప్రభుత్వం అందించే అరకొర సరఫరాలో నాణ్యమైన విద్యుత్ను ఇవ్వడంలేదు. పేరుకే త్రీఫేజ్ కరెంట్ అని చెబుతున్నా.. ఎక్కడా సరిగా రావడం లేదు. త్రీ ఫేజ్లో ఒక ఫేజ్ డౌన్ అవుతున్నది. విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది. రైతులంతా ఒకే సమయంలో బోర్లు ఆన్ చేస్తున్నారు. కనెక్షన్లకు సరిపడా ట్రాన్స్ఫార్మర్లు లేవు. దీంతో ట్రాన్స్ఫార్మర్పై ఓవర్ లోడ్ పడుతుండటంతో మాటిమాటికీ ట్రిప్ అవుతున్నాయి. అదే విధంగా ఓవర్ లోడ్ కారణంగా లోవోల్టేజీ సమస్య రావడంతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. దీంతో రైతులకు అదనపు ఆర్థిక భారం తప్పడంలేదు. మోటార్లు, మెకానిక్, వాహనం, ఇతర ఖర్చులు కలుపుకొని రూ.. 5వేల నుంచి 6వేల వరకు భరించాల్సి వస్తున్నది. ఫలితంగా మెకానిక్లకు చేతినిండా పని దొరుకుతోంది. ఇక ట్రాన్స్ఫార్మర్లు పాడైనప్పుడు విద్యుత్ అధికారులు రూలింగ్ పాటించడంలేదు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అధికారులు వెంటనే రూలింగ్ పాటించాలి. వెంటనే ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణాలోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇది ఎక్కడా అమలు కావడంలేదు.
పంటలను కాపాడుకోవడానికి సాగు నీటి సమస్య ఒక ఎత్తు అయితే.. విద్యుత్ సరఫరా మరో ఎత్తు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉంది. మరో నెలపాటు పుష్కలంగా నీళ్లు అందించాలి. అలా అయితేనే దిగుబడి మంచిగా వస్తుంది. మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుంది. కానీ కరెంటోళ్ల నిర్వాకంతో సాగునీటికి తిప్పలు తీరడంలేదు. బోర్లు, బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని పంటలకు పారిద్దామంటే కష్టాలు తప్పడంలేదు. అనేక చోట్ల పంటలకు నీళ్లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ సరఫరాలో పదేపదే అంతరాయం కలగడం వల్ల పొలాలకు నీళ్లు సరిగా పారడంలేదు. మొదటి మడి మాత్రమే పారుతూ.. చివరి మడులకు నీళ్లు చేరడంలేదు. ఇక అనేక చోట్ల కరెంట్ సమస్యతో నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
“ఈ సారి పంటల సాగు పెరగడంతో విద్యు త్ పై భారం పెరిగింది. కరెంట్ లోడ్ పెరిగిన మాట వాస్తవమే. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వెంటనే రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. విద్యుత్ వేసవి కార్యచరణ రూపొందించాం. ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుకుంటాం.