నిరంతర నిఘా, తనిఖీలతో పోలీసుల ఉక్కుపాదం
రవాణాను అరికట్టడమే లక్ష్యంగా అడుగులు
హైవేల మీద ఎక్కడికక్కడ కట్టడి
పెద్దఎత్తున అరెస్టులు, గంజాయి స్వాధీనం
కటకటాల్లోకి కీలక వ్యక్తులు
తాజాగా నకిరేకల్ శివారులో 120 కిలోల గంజాయి పట్టివేత
అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా ఇతర రాష్ర్టాలకు రవాణా అవుతున్న గంజాయి పెద్దఎత్తున పట్టుబడుతున్నది. తాజాగా మంగళవారం నల్లగొండ జిల్లా పోలీసులు నకిరేకల్ వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఇలా అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా మూలాల్లోకి వెళ్లి దెబ్బకొడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే రహదారులపై గాంజా మాఫియా ఆట కట్టిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 155 మందిని కటకటాల్లోకి నెట్టి, 3వేల కేజీలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ ప్రతినిధి, జూలై5(నమస్తే తెలంగాణ) : మానవవనరులను, ముఖ్యంగా యువతను చిత్తు చేస్తున్న మత్తు పదార్థ్ధాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తున్నది. గతేడాది సెప్టెంబర్ 15 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా, వినియోగం ఆనవాళ్లు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో డీజీపీ మహేందర్రెడ్డి నిత్యం గంజాయి, ఇతర డ్రగ్స్ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దాంతో ఉమ్మడి జిల్లాలో పోలీసు యంత్రాంగం 9 నెలలుగా పూర్తి స్థాయిలో పని చేస్తున్నది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా పోలీసులు ఆయా జిల్లాల పరిధిలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించాయి. ఈ స్పెషల్ డ్రైవ్లో ఎక్కడికక్కడే తనిఖీలు చేస్తుండడంతో గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నది. హైవేలపై నిరంతరం నిఘా పెడుతూ పాత నేరస్తుల సహకారంతో గంజాయి మూలాలను దెబ్బకొట్టేలా కృషి చేస్తున్నారు. ప్రారంభంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై తనిఖీ ముమ్మరం చేయడంతో అప్పటివరకు ప్రైవేటు వాహనాలు, ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు, రైళ్లల్లో రవాణా చేసే స్మగ్లర్లు బైక్లను సైతం వినియోగించడం మొదలుపెట్టారు.
ప్రధానంగా విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిని రవాణాకు వినియోగిస్తున్నట్లు గుర్తించి ఎక్కడికక్కడే దీనిపై జిల్లాల వారీగా తనిఖీలు నిర్వహించారు. దీంతో స్మగ్లర్లు రూట్ మార్చి కోదాడ- మిర్యాలగూడ- దేవరకొండ రూట్ను ఆశ్రయించారు. కొందరు ఖమ్మం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిని ఎంచుకున్నారు. దీంతో పాటు హైవేలను వదిలి గ్రామీణ రహదారుల ద్వారా రవాణాకు యత్నించారు. ఇక్కడా కూడా పోలీసులు ప్రత్యేక వ్యూహంతో కట్టడికి దిగారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమైన అన్ని రహదారుల్లోనూ గట్టి నిఘా పెట్టి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే చాలా వరకు గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడింది. ఇంకా ఈ దందానే ఆధారంగా బతికే కొందరూ పాత నేరస్తులు కొత్త పద్ధ్దతుల్లో అప్పుడప్పుడూ గంజాయి రవాణా యత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపైనా నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి తనిఖీలోనే మంగళవారం నకిరేకల్ సమీపంలో హైవేపై పోలీసులు ఇద్దర్నీ అరెస్టు చేసి జైలుకు పంపించారు. గతేడాదిలో నల్లగొండ జిల్లాలో 110 మందిని గంజాయి కేసుల్లో అరెస్టు చేసి 2,100 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 35 కేసుల్లో 45 మందిని అరెస్టు చేయడంతో పాటు 940 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు మొత్తం 16 కేసుల్లో 881.250 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు.
మూలాలపై దెబ్బకొడుతూ…
గంజాయి పట్టుబడితో దానితో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా మొత్తం దందా పూర్వపరాలపై పట్టు సాధించారు. రవాణా చేస్తున్న వ్యక్తితో ఎక్కడి నుంచి తెస్తున్నారు? దాన్ని ఎక్కడ కొనుగోలు చేశారు? సాగు చేస్తున్నది ఎవరూ? అన్న దందాలోని ప్రాథమిక వివరాలతో పాటు దీన్ని ఎక్కడికి చేరవేస్తున్నారు? ఎవరూ దీన్ని కొనుగోలు చేస్తున్నారు? వారు ఎవరికీ విక్రయిస్తున్నారు? ఇలా అనేక విషయాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి దందాలో కీలకమైన సాగు, రవాణాలో కీలకమైన వ్యక్తులను గుర్తించడం సులువుగా మారింది.
సరిహద్దులో గంజాయి సాగు
ప్రధానంగా గంజాయి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో నల్లగొండ పోలీసులు ఏఓబీపై దృష్టి సారించి అక్కడి మూలలను ఛేదించేందుకు గత అక్టోబర్లో అప్పటి ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కీలక వ్యక్తులను అరెస్టు చేయగలిగారు. వీరి ద్వారా నిరంతరం గంజాయిని దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్న గ్యాంగ్లను సైతం అడ్డుకోగలిగారు. ఉమ్మడి జిల్లాలో గంజాయి దందాకు కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలన్న లక్ష్యంగా జిల్లా పోలీసు బాసుల నేతృత్వంలోనూ పోలీసులు పట్టువీడకుండా కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో గంజాయి వినియోగం కంటే కూడా రవాణానే భారీ మొత్తంలో సాగుతున్నట్లు ఇప్పటివరకు సాగిన ఆపరేషన్లో స్పష్టమైంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా కారిడార్గా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులను ఇన్నాళ్లు స్మగ్లర్లు వినియోగించినట్లు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ వెల్లడించారు. అందుకు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే రహదారులన్నింటిపైనా నిరంతరం నిఘా కొనసాగుతుందని వివరించారు. గంజాయి సాగు, రవాణా, వినియోగం ఇలా మూడు అంశాలుగా దీనిపై ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. స్థానికంగా ఎక్కడైనా గంజాయి ఆనవాళ్ల సమాచారం ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
120 కిలోల గంజాయి పట్టివేత
రూ.7లక్షల నగదు, కారు స్వాధీనం
అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్టు
నీలగిరి, జూలై 5 : ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబయికి తరలిస్తున్న 120 కిలోల గంజాయి, రూ.7లక్షల నగదును నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి కేసు వివరాలు వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున ఏపీ ఎంజడ్ 8970 నంబరు గల కారులో 120 కిలోల గంజాయిని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు నకిరేకల్లో పట్టుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న సంగారెడ్డికి చెందిన రాథోడ్ మోహన్, గాజువాకకు చెందిన మందలక ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనకాపల్లికి చెందిన దేవేందర్ వద్ద గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. రాథోడ్ మోహన్ గతంలో గంజాయి రవాణా చేస్తూ విశాఖ జిల్లాలో పట్టుబడి సెంట్రల్ జైలుకు వెళ్లగా, జైల్లో మందలంక ప్రవీణ్ పరిచయమయ్యాడు. రాథోడ్ మోహన్ కోర్టు కేసులకు వచ్చి వెళ్తున్న క్రమంలో అనకాపల్లికి చెందిన దేవేందర్ పరిచయమయ్యాడు. వారు ముగ్గురూ కలిసి గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. దేవేందర్ అనకాపల్లిలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి రాథోడ్ మోహన్, ప్రవీణ్కు అప్పగించాడు.
వారు మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్మాలని తీసుకెళ్తుండగా నకిరేకల్లో పట్టుబడ్డారు. అనకాపల్లిలో ఉన్న దేవేందర్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. నిందితుల వద్ద కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని పట్టుకున్న టాస్క్ఫోర్స్ డీఎస్పీ మొగిలయ్య, నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, నకిరేకల్ సీఐ వెంకటయ్య, ఎస్ఐలు శంకర్, గోపీకృష్ణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.