నీలగిరి, మే 27 : ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సిబ్బందికి సూచించారు. బుధవారం నల్లగొండ- 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరిపాలన, శాంతి భద్రతల నిర్వహణ, నేర నియంత్రణ చర్యలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లో నమోదైన వివిధ కేసులకు సంబంధించిన ఎఫ్ఎ.ఆర్ రిజిస్టర్లు, కేస్ డైరీలు, పెండింగ్ కేసుల వివరాలు, కోర్ట్ డిస్పోజల్ రికార్డులు, వారంట్ అమలు స్థితి తదితర అంశాలను ఎస్పీ పరిశీలించారు. రికార్డుల వివరాలు, కేసుల పరిష్కారాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు. క్రైమ్ ప్రాపర్టీ రూమ్లో భద్రపరిచిన కేసు సంబంధిత వస్తువులు, స్వాధీనం చేసుకున్న సామగ్రి, వాహనాల నిర్వహణను తనిఖీ చేసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో భద్రపరచాలని సూచించారు. కోర్ట్ రికార్డ్ రూమ్ నిర్వహణను పరిశీలించి కేసు పత్రాలు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, వాష్ రూమ్లు, మెన్ బ్యారేక్, సిబ్బంది విశ్రాంతి గదులు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి సిబ్బందికి మెరుగైన వాతావరణం కల్పించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది కిట్, యూనిఫామ్, ఆయుదాల నిర్వహణ, డ్యూటీ నిర్వహణ తీరు, హాజరు పుస్తకాలను కూడా పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ, రాత్రి వేళల్లో బ్లూ కోర్ట్స్, పెట్రోలింగ్ పార్టీలు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థలు, బస్టాండ్ లు, మార్కెట్ ప్రాంతాలు, బ్యాంకుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనుమానిత వ్యక్తులు ఆనుమానాస్పద వాహనాలపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, జూదం, అక్రమ మద్యం, ఈవ్ టీజింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు.
మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మహిళా సంబంధిత ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత పెంచి నేర నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పోలీసులపై నమ్మకం పంచాలని, గ్రామాలు, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు, స్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఎస్పీ, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. ఎస్పీ వెంట డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, డీసీఆర్ బీ సీఐ శ్రీను నాయక్, 2 టౌన్ ఎస్.ఐ సైదులు ఉన్నారు.

ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందించాలి : ఎస్పీ శరత్చంద్ర పవార్