భూదాన్ పోచంపల్లిలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఐహెచ్టీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) ఏర్పాటుపై నేతన్నల్లో ఆశలు చిగురించాయి. ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రజల చిరకాల ఆకాంక్ష అడుగు దూరంలోనే ఉంది. ఎన్నో వినతులు, విజ్ఞప్తుల తర్వాత తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఐఐహెచ్టీ మంజూరు చేసింది. ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఐఐహెచ్టీ వస్తే నేత కార్మికుల వృత్తి నైపుణ్యత మెరుగుపడటం, చేనేత పరిశ్రమ మరింత బలోపేతం కావడంతోపాటు నేతన్నల ఉపాధి రెట్టింపు అవుతుంది. ఇక్కడే అనేక అనుకూలతలు, సానుకూల అంశాలు ఉన్నాయని, పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, మార్చి 3 (నమస్తే తెలంగాణ)
దేశంలోనే అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యాసంస్థగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పేరుంది. విద్యకు ఐఐటీ మాదిరిగా చేనేతకు ఐఐహెచ్టీని పరిగణిస్తారు. దేశ వ్యాప్తంగా పది సంస్థలు ఉన్నా.. అత్యధికంగా నేత కార్మికులు ఉన్న తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఇంతకాలానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఐఐహెచ్టీని మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోనుంది. విద్యాసంస్థ ఏర్పాటు, నిర్వహణ, సిబ్బంది నియామకం మన సర్కారు చేతుల్లోనే ఉంటుంది. అయితే ఐఐటీహెచ్ ఎక్కడ నెలకొల్పుతారనేది స్పష్టత రాలేదు. దీనిపై క్లారిటీ వస్తే ఫస్ట్ బ్యాచ్లో 75మందితో ఐఐహెచ్టీని ప్రారంభించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నలబై వేల చేనేత కుటుంబాలు ఉండగా, అత్యధికంగా భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికులు ఉన్నారు. ఆనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులను నమ్ముకొని మగ్గాలపై చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు. పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం, తయారీ రంగం ఉంది. ఈ నేపథ్యంలో చేనేత సాంకేతిక కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఐఐహెచ్టీల్లో కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం దేశంలోనే పది రాష్ర్టాల్లో ఈ సంస్థ ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, అసోం, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ, కర్నాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో ఉన్నాయి. కానీ తెలంగాణలో ఐఐహెచ్టీ లేకపోవడంతో ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఆర్థికంగా ఇబ్బంది కావడంతోపాటు, దూరభారం అవుతున్నది. అయితే భూదాన్పోచంపల్లిలోనే ఐఐహెచ్టీని నెలకొల్పాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో అన్ని వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి గత రాష్ట్ర సర్కారు పలు సార్లు ప్రతిపాదనలు కూడా పంపించింది.
పోచంపల్లిలో ఐఐహెచ్టీ ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు, సానుకూల అంశాలు ఉన్నాయి. ఇప్పటికే పోచంపల్లి చేనేతకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కత్ వస్ర్తాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక మండలంలోని కనుముక్కుల పరిధిలో ఉన్న హ్యాండ్లూమ్ పార్క్లో భవనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది 23 ఎకరాల్లో విస్తరించి ఉంది. 5000 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ పార్ పెట్టుబడి సరైన నిర్వహణ లేక మూతపడింది. దీన్ని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.12.5 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం పారులోని విశాలమైన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్తోపాటు పలు జిల్లా కేంద్రాలకు పోచంపల్లి దగ్గరలో ఉంటుంది.
ఐఐహెచ్టీ ఏర్పాటైతే అనేక విధాలుగా దోహదపడుతుంది. మన దగ్గరే టెక్నికల్ డిగ్రీ, డిప్లొమాలను పొందే అవకాశం దక్కుతుంది. చేనేత, జౌళి, డిప్లొమో డిగ్రీ పీజీ కోర్సులతోపాటు పరిశోధన, అభివృద్ధి అధ్యయనాలు జరుగుతాయి. రెగ్యులర్ శిక్షణతోపాటు టెక్నికల్ టెక్స్టైల్స్కు సంబంధించిన చదువులు, టెక్స్టైల్ డిజైనింగ్, దుస్తుల డిజైనింగ్, మార్కెటింగ్, అంతర్జాతీయ వర్తకం లాంటి అంశాల్లో బోధన అందుతుంది. చదువుకొని చేనేత వృత్తులోకి రావాలనుకునే యువతకు ఉపాధి లభిస్తుంది. ఆన్లైన్ చీరెల వ్యాపారానికి యువకులు అవసరమైన మెళకువలు నేర్చుకుంటారు. చేనేత రంగం మరింత బలపడేందుకు నైపుణ్యం కలిగిన వ్యక్తులను తీర్చిదిద్దేందుకు సంస్థ దోహదపడుతుంది. అంతే కాకుండా చేనేత కార్మికులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి వేదిక అవుతుంది. ముఖ్యంగా స్పిన్నింగ్, వీవింగ్, డిజైనింగ్, డైయింగ్, ప్రింటింగ్, గార్మెంట్ మేకింగ్, మారెటింగ్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో సాంకేతిక పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు.
ఐఐహెచ్టీకి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని మాజీ మంత్రి కేటీఆర్ అనేక విధాలుగా తన వంతు ప్రయత్నాలు చేశారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో దీని ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు లేవదీశారు. అనేక సార్లు కేంద్ర మంత్రులకు స్వయంగా లేఖలు రాశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. భూదాన్పోచంపల్లిలో ఐఐహెచ్టీ ఏర్పాటుపై విన్నవించారు. కాగా భూదాన్ పోచంపల్లిలోనే ఏర్పాటు చేస్తారా..? లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న గద్వాలకు తరలించుకుపోతారా అనేది వేచి చూడాల్సిందే.
పోచంపల్లి అంటేనే చేనేతకు బ్రాండ్ అంబాసిడర్. ఇక్కత్ వస్ర్తాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి మంజూరు చేసిన ఐఐహెచ్టీ పోచంపల్లిలోనే నెలకొల్పాలి. ఇందుకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నాయి. అన్ని రకాలు వసతులు, వనరులు ఉన్నాయి. కేంద్రం దివాళా తీయిస్తే పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును బీఆర్ఎస్ సర్కారు కొనుగోలు చేసింది. ఇదిప్పుడు నిరుపయోగంగానే ఉంది. మన దగ్గర్నే ఉంటే అనేక విధాలుగా నేతన్నలకు మేలు జరుగుతుంది. ఇక్కడే ఏర్పాటు చేయాలని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ ద్వారా కేంద్రానికి లేఖలు రాయించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పోచంపల్లిలోనే ఐఐహెచ్టీ ఏర్పాటు చేయాలి. లేకుంటే ప్రభుత్వంతో పోరాటం తప్పదు.
– పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
పోచంపల్లిలోని కనుముకుల గ్రామంలో చేనేత పారును ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక్కడ ఐఐహెచ్టీ ఏర్పాటు చేస్తే చేనేత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. నూతన డిజైన్ల ఆవిష్కరణకు అవకాశం ఉంటుంది. ఇక్కత్ వస్త్ర పరిశ్రమ మరింత మెరుగుపడుతుంది.
-రుద్ర వెంకటేశం, చేనేత కార్మికుడు భూదాన్ పోచంపల్లి