– బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్
మిర్యాలగూడ టౌన్, జూన్ 23 : మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో ఈ నెల 5న ముగ్గురి సజీవ దహనానికి కారణమైన నిందితుడు శ్రీకాళహస్తి శిరీష్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ డిమాండ్ చేశారు. స్థానిక మిర్యాలగూడ పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భార్య ధనమ్మపై కోపంతో అభం శుభం తెలియని అత్త వనం చందమ్మ, పిల్లలు నక్క లక్ష్మణ్, నక్కా ప్రణీతను అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టడం సహించరానిదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మొన్నటికి మొన్న ధనమ్మ ఇటీవల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బయట పెట్రోల్ పోసుకుని తన భర్త బయటకు వస్తే తనను కూడా చంపేస్తాడని పేర్కొంటూ పెట్రోల్ పోసుకోవడం జరిగిందన్నారు. కావునా నిందితులకు బెయిల్ రాకుండా న్యాయవాదులు ప్రయత్నం చేయాలని, వెంటనే బహిరంగ శిక్షపడేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు లావురి క్రాంతి కుమార్, వెంకటేష్, పవన్, శ్రీకాంత్, సందీప్, సునీల్, నాగార్జున, నాగయ్య, లావణ్య, రజిత, ప్రియాంక, సునీత, మాలతి, స్వాతి పాల్గొన్నారు.