– మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర
నీలగిరి, ఏప్రిల్ 09 : నల్లగొండ నగర అభివృద్ధికి పన్నులే బలమని, సీనియర్ సిటిజన్లను ఆదర్శంగా తీసుకుని పట్టణ వాసులు పన్నులు చెల్లించేందుకు ముందుకు రావాలని నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికల కార్యాక్రమంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని 48వ డివిజన్లో ట్రేడ్ లైసన్స్లు, 11, 34వ డివిజన్లో ఆస్తి పన్నుల వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తి పన్నులో ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రిబేట్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు.
బకాయిలు వాయిదా వేయొద్దు ఇప్పుడే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్లు తమ పన్నులు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వారి చైతన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ట్రేడ్ లైసెన్సుల వసూళ్లను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరి శివరాంరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గన్నారు.