నిడమనూరు, జనవరి 21 : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచాన్నే అరచేతిలోకి అందుబాటులోకి తెచ్చినా మూఢ నమ్మకాలు మాత్రం ప్రజల జీవితంపై ఆధిపత్యం చేస్తూనే ఉన్నాయి. గ్రామంలో విషజ్వరాలు ప్రబలగా.. ఊరికి కీడొచ్చిందని భావించిన ఆ గ్రామస్తులంతా తెల్లవారుజామునే ఇల్లు వదిలి వన భోజనాలకు వెళ్లారు. గ్రామం చుట్టూ పొత్తి పోసి రాకపోకలను నిలిపివేశారు. ఈ సంఘటన నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి.. పార్వతీపురం గ్రామంలో నెల రోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు అనారోగ్యం బారిన పడ్డారు. గ్రామాన్ని సందర్శించిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది డెంగీ లక్షణాలను గుర్తించారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉండటం, లార్వా వ్యాప్తి చెందడం వంటి కారణాలే విషజ్వరాల తీవ్రతకు కారణమని నిర్ధారించారు.
ఇవేమీ పట్టించుకోని గ్రామ పెద్దలు మిర్యాలగూడలో శివసత్తులను ఆశ్రయించారు. ఊరికి కీడొచ్చింది.. ఊరు వదలాలని శివసత్తులు చెప్పడంతో శనివారం అర్ధరాత్రి గ్రామస్తులంతా పార్వతీపురం చుట్టూ పొత్తి పోసి రహదారికి అడ్డుగా కంప వేసి గ్రామానికి రాకపోకలను నిలిపివేశారు. తెల్లవారుజామున 5 గంటలకు గ్రామస్తులంతా కుటుంబంతో కలిసి ఇండ్లను వదిలి గ్రామ శివార్లలో వన భోజనాలకు వెళ్లారు.
ఆదివారం మధ్యాహ్నం తిరిగి గ్రామంలోకి వచ్చారు. ఈ విషయమై సర్పంచ్ వంకా బ్రహ్మన్నను వివరణ కోరగా.. నెల రోజులుగా తీవ్ర జ్వరాల నేపథ్యంలో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. విష జ్వరాల నివారణకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శివసత్తులు చెప్పిన కొలుపుతో గ్రామస్తుల కోరిక మేరకు కొన్ని గంటల పాటు ఊరు వదిలినట్లు తెలిపారు.