పేదలకు వైద్యం మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1వ వార్డు పరిధి కుడకుడలో పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించిన మాట్లాడారు. మారుమూల పట్టణవాసులకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ దవాఖానలో పైసా ఖర్చులేకుండా 120 రకాల పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేస్తారని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటుతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ వైద్యం రంగంలో తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణగా మారుతున్నదని అన్నారు.
సూర్యాపేట టౌన్, డిసెంబర్ 8 : వైద్య రంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని.. అందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు దోస్తీలుగా బస్తీ, పల్లె దవాఖానలను ఏర్పాటు చేశారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1 వ వార్డు పరిధిలోని కుడకుడలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను గురువారం ఆయన ప్రారంభించిన మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో బస్తీ వాసులకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్తీలోనే అన్ని రకాల ప్రభుత్వ వైద్య పరీక్షలు అందుబాటులో ఉంచామని.. ఈ దవాఖానల ద్వారా నాణ్యమైన వైద్యం పైసా ఖర్చులేకుండా అందించడంతో పాటు 120 రకాల పరీక్షలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బస్తీ దవాఖానలో డాక్టర్లు, నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఎక్కడికక్కడే పేదలకు నాణ్యమైన వైద్యం
2014 కు ముందు గత పాలకుల హయాంలో మామూలు రోగాలకు కూడా ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటేనే భయపడడంతో ప్రజలు అనేక అంటువ్యాధులతో ఇబ్బంది పడిన పరిస్థితి ఉండేదని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆరోగ్య స్థితి గతుల విషయంలో అభివృద్ధి జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రసూతి కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటే ఆమడ దూరం పారిపోయే రోజుల నుంచి ప్రసూతి అంటే ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలనుకునే విధంగా మార్పు జరిగిందన్నారు. మండల కేంద్రంలో మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిత్యం పెరుగుతున్న రోగుల తాకిడే ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం అని మంత్రి అన్నారు. వైద్యం, విద్య విషయంలో ఏ సమాజమైతే ముందు ఉంటుందో ఆ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుంటుందన్న మంత్రి సీఎం వైద్య రంగం కోసం కేసీఆర్ తీసుకున్న అనేక పథకాలు వాటి అమలుతో రాష్ట్రం సంపూర్ణ అరోగ్య తెలంగాణగా మారుతుందన్నారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, గుర్రం సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.