చివ్వెంల, డిసెంబర్ 29 : పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ పనులు నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన దురాజ్పల్లి పెద్దగట్టు పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన ఛాంబర్లో ఏస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైన లింగమంతుల స్వామి జాతరకు ఉమ్మడి ఏపీ నుంచే గాక ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య పనులు, నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్దగట్టు జాతరలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అన్ని రూట్లలో సీసీ కెమెరాలతో పర్యవేక్షస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులుయాదవ్, జడ్పీ సీఈఓ సురేశ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, ఈఓ కుశలయ్య, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ మిషన్ భగీరథ వెంకటేశ్వర్లు, డీపీఓ యాదయ్య, ఈఈ ఆర్అండ్బీ యాకూబ్, విద్యుత్ శాఖ ఎస్ఈ పాల్రాజ్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.