రాష్ట్రంలో రెండో అతి పెద్దదైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 5 నుంచి నిర్వహించేందుకు ఆలయ పాలకవర్గం నిర్ణయించింది. ఫిబ్రవరి 9వరకు ఐదురోజులపాటు జరిగే ఉత్సవాల షెడ్యూల్ను తేదీలను సోమవారం దేవస్థానం వద్ద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో ప్రకటించింది. అంతకుముందు ఆలయ కొత్త పాలకవర్గంతో మంత్రి జగదీశ్రెడ్డి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలయం వద్ద నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మన పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పునర్వైభవం తీసుకొచ్చారన్నారు. పెద్దగట్టు జాతరకు గత ప్రభుత్వాలు సరిపోను నిధులివ్వలేదని, స్వరాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కోనేరు, కళ్యాణ కట్ట, పూజార్లకు గదులు, గెస్ట్ హౌస్, సోలార్ లైట్లు, సీసీ రోడ్లు నిర్మించడాన్ని గుర్తు చేశారు. గట్టు ముందు ఉన్న చెరువును మినీట్యాంక్ బండ్ కట్టేందుకు చర్యలు తీసుకుంటామని, అక్కడే యాదవ భవనం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెద్దగట్టును నిత్య సందర్శన ప్రాంతంగా మారుస్తామని తెలిపారు.
రెండు సంవత్సరాలకోసారి జరుగనున్న దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 5 నుంచి ఐదు రోజుల పాటు జరుగనున్నది. సోమవారం ఆలయ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో ఆలయ పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు పెద్దగట్టు లింగన్న జాతర జరుపనున్నట్లు తెలిపారు. అనంతరం జాతరకు సంబంధించిన పోస్టర్ను మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల ఆవిష్కరించారు.
ఐదు రోజుల పాటు జాతర
జనవరి 22న దిష్టి పూజతో జాతర పనులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 5న(ఆదివారం) కేసారం నుంచి దేవరపెట్టెను తీసుకొచ్చి గంపలతో గుడిచుట్టూ ప్రదక్షణ, 6న బోనాల సమర్పణ, మద్దెరపోలు, మధ్యాహ్నాం జాగిలాలు పోయడం, 7న గుడిముందు పూజారులు చంద్రపట్నం వేయడం, 8న నెలవారం, దేవరపెట్టె కేసారం తీసుకుపోవడం, 9న జాతర ముగింపు, మకర తోరణం ఊరేగింపుతో సూర్యాపేటకు తరలింపు.