దామరచర్ల, ఫిబ్రవరి 20 : దామరచర్ల మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.34వేల కోట్లతో 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పర్యావరణ అనుమతి కోసం మంగళవారం అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు పరిసర గ్రామస్తులు, నాయకులు పాల్గొని అనుకూలంగా ఆమోదం తెలిపారు. మండలంలో గత ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం జూన్ 29, 2017లో అన్ని రకాల అనుమతులు తీసుకున్నది. పనులు కూడా దాదాపు పూర్తికావస్తున్నాయి.
రెండు యూనిట్లు అందుబాటులోకి రానున్న క్రమంలో విశాఖ, ముంబైకి చెందిన ఎన్జీఓలు పర్యావరణ అనుమతి రద్దు చేయాలని ఎన్జీటీలో కేసులు వేశారు. ఎన్జీటీ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కలెక్టర్ హరిచందన అధ్యక్షతన యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పవర్ప్లాంట్ బాధిత గ్రామాలైన మండలంలోని తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం, కల్లేపల్లి, శాంతినగర్, పుట్టలగడ్డతండా, కపూర్తండాలతో పాటు మిర్యాలగూడ పట్టణం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ఎన్జీఓలు కూడా పాల్గొన్నారు. ముందుగా నమోదు చేసుకున్న వివరాల ప్రకారం తమ అభిప్రాయాలను సభలో తెలియజేశారు. మొత్తం 48 మంది తమ అభిప్రాయలను తెలుపగా అందులో కేవలం ఐదుగురు మాత్రమే ప్లాంట్ను వ్యతిరేకించారు. వీరితో పాటుగా లిఖితపూర్వంగా 22 మంది, ఈమెయిల్ ద్వారా 35 మంది అభిప్రాయాలను తెలిపారు.
ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయడం మంచిదే. కానీ ఇక్కడ భూ నిర్వాసితులు, ల్యాండ్ లూజర్, ఎన్క్రోచర్ల సమస్యలు పరిష్కరించాలని పలువురు గ్రామస్తులు కోరారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని, అధికంగా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉండడం వల్ల దుమ్ము, ధూళితో అనారోగ్యాల పాలవుతారని, కర్మాగారం నుంచి కాలుష్యం రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్లాంట్ చుట్టు పక్కల గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, రహదారులు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణానది తీరంలో వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, కృష్ణానది, అన్నవేరు వాగులు కలుషితం కాకుండా చూడాలని కోరారు.
కాలుష్య రహితంగా అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి కాలుష్యం రాదని టీఎస్ జెన్కో డైరెక్టర్ అజయ్ తెలిపారు. పలువురు ఎన్జీఓలు అడిగిన అభ్యంతరాలపై ఆయన సమాధానం చెప్పారు. ప్లాంట్ నుంచి వచ్చే నీరు కృష్ణా, అన్నవేరు వాగులకు వదిలేదు లేదని, వేస్ట్ వాటర్ను ట్రీట్మెంట్ చేసి తిరిగి వాడుతామని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్లాంట్ కోసం తీసుకున్న 1800 హెక్టార్ల అటవీ భూమిని దేవరకొండ వద్ద అటవీ శాఖకు అప్పగించామని, దీనితో పాటుగా 80 కోట్ల రూపాయలు చెల్లించామని అన్నారు. కొవిడ్ కారణంగా రెండుసార్లు లాక్డౌన్ విధించడంతో పదివేల మంది కార్మికులు రెండుసార్లు వారి ప్రాంతాలకు వెళ్లడంతో నిర్మాణం నిలిచిపోయిందని తెలిపారు. త్వరలో ప్లాంట్ పూర్తిచేసి విద్యుత్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జెన్కో సీఎండీ రిజ్వీ, జిల్లా పర్యావరణ శాఖ అధికారి సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి వపర్ప్లాంట్ నిర్మాణాన్ని రాజకీయ కోణంతో చూడవద్దని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యాదాద్రి పవర్ప్లాంట్ ఏర్పాటుతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాజకీయాలకతీతంగా సహకరించాలని, గ్రామాల అభివృద్ధికి ప్లాంట్ ఎంతో అవసరం పడుతుందని చెప్పారు. కాకపోతే ల్యాండ్ సేకరణలో, ల్యాండ్ లూజర్ల విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్లాంట్ ప్రారంభానికి ముందగానే నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు నాలుగు లైన్ల రహదారి పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు.
కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణం చేపట్టారని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైనా పరిశ్రమలు ఏర్పాటు అయితే లాభనష్టాలు ఉంటాయని, కానీ నష్టాన్నే బూచిగా చూపించి ప్లాంట్ను వ్యతిరేకించడం సరికాదని సూచించారు. యాదాద్రి పవర్ప్లాంట్ దేశానికే తలమానికంగా మారిందని, ప్రపంచ పటంలో ప్లాంట్ గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్లాంట్ పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత తగ్గుతుందన్నారు. తొలుతగా ప్లాంట్ కోసం సేకరించిన భూమిలో అవసరం లేని 1,230 ఎకరాలు గిరిజనులకు అప్పగించాలని కోరారు.