వ్యవసాయ, పోలీస్ అధికారుల
సమావేశంలో డీఎస్పీ, డీఏఓ
నీలగిరి, మే 7 : రైతాంగం నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, నాగేశ్వర్రావు, వ్యవసాయ అధికారి వై సుచరిత అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తా మని హెచ్చరించారు. వానకాలం సీజన్లో నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికా రులు పనిచేయాలన్నారు. ఇందుకోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయా లని పేర్కొన్నారు. మండల, సర్కిల్, సబ్ డివిజన్ స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని సూచించారు.
డీలర్లు తమ దుకాణాల్లో స్టాక్ బోర్డులు, లైసెన్సులు తప్పని సరిగ్గా ప్రదర్శించాలని, స్టాక్, బిల్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాల న్నారు. విడి విత్తనాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని, విత్తన ప్యాకెట్లపై లేబుల్ను పరిశీలించి గడువు దాటిన విత్తనాలను అమ్మకుండా చూడాలని అధికారులను ఆదేశిం చారు. జిల్లా ఆంధ్ర రాష్ర్టానికి సరిహద్దుగా ఉండడంతో నకిలీ విత్తనాలు సరఫరా అయ్యే అవకాశం ఉంటుందని, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై నిఘా ఉంచాలన్నారు. గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏడీఏలు శ్రీధర్రెడ్డి, హుస్సేన్బాబు, శ్రావణ్కుమార్, ఎల్లయ్య, నాగమణి, వెంకటరవీందర్, బీరప్ప, అన్ని మండలాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.