యాదాద్రి భువనగిరి, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్నది. కొన్నేండ్లుగా ఎన్నికలు కాస్ట్లీగా మారాయి. ఆడంబరాలు, విందులు, వినోదాలు, ప్రలోభాలు, పంపకాలు, ప్రచార ఆర్భాటాలు.. ఒకటా, రెండా.. ఇలా చెప్పుకొంటూ పోతే అనేకం. పోలింగ్కు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో అటు పార్టీలు, ఇటు అభ్యర్థులు, ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలు ఉండటంతో ఖర్చు పెరిగి తడిసి మోపెడవుతుందని పరేషాన్ అవుతున్నారు. ఈ సారి ఎలక్షన్స్లో ఒక్కో అభ్యర్థి రూ. 50 కోట్ల దాకా ఖర్చు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల ఖర్చుపై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది.
డబ్బుతోనే అన్నీ..
పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 18న నోటిఫికేషన్ రానుంది. రాష్ట్రంలో నాలుగో విడుత కావడంతో మే 13న పోలింగ్ జరుగనున్నది. ఇప్పటి నుంచి సుమారు రెండు నెలల సమయం ఉంది. గతంతో పోలిస్తే ఇప్పటి ఎన్నికలు డబ్బులతోనే ముడిపడి ఉన్నాయి. విస్తృతంగా ప్రచారం చేయాలి. రెండు నెలల పాటు ఓటర్ల చుట్టూ తిరుగాలి. క్యాంపెయిన్ కోసం బూత్ల వారీగా ఖర్చులు భరించాలి. ప్రచారంలో మంది మార్బలం ఉండాలి. ప్రచార రథాలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. కరపత్రాలు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు అవసరం. గతంలో మాదిరి సమావేశాలకు ఉత్తగనే ఎవరూ రావడంలేదు. సమావేశం, సభకు రావాలంటే పెద్ద నోటు అప్పజెప్పాల్సిందే. కనీస రూ.200 నుంచి రూ.400 ముట్టజెపాల్సిందే. కేడర్ను కాపాడుకోవాలి. పార్టీ శ్రేణులకు పెట్రోల్, డీజిల్, భోజనాలు తదితర అవసరాలు తీర్చాలి. ఇలా రోజుకు రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటుంది.
ఖర్చుపై అంచనాలు
ఎన్నికలు ఖరీదుగా మారడంతో పార్టీలు, అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో బరిలో నిలిచే అభ్యర్థులు, ఆశావహులు ముందుగానే డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల వారీగా ఎన్నికలకు ఖర్చు అంచనా వేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి పరిస్థితులకు అనుగుణంగా రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల దాకా ఖర్చు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీతో పోలిస్తే ఓటర్లకు డబ్బుల పంపకం పరిమితిగా ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో రూ. 50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసి, ఆ మేరకు ఫండ్స్ రెడీ చేసుకుంటున్నారు. ఇందులో కొంత పార్టీ భరించనుండగా, మరికొంత అభ్యర్థులు సొంతంగా అడ్జెస్ట్ చేసుకోనున్నారు. ఇప్పటికే కొందరు ఆయా చోట్ల డంప్ చేసే ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక అనుకున్న దాని కన్నా కొంత మేర అదనంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి
ఎన్నికల్లో ఖర్చుపై ఎలక్షన్ కమిషన్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేసేందుకు ప్లాన్ రూపొందించింది. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో 23ఫ్లయింగ్ స్కాడ్స్, 23 స్టాటిస్టికల్ సర్వేయల్ టీమ్లు, 9 వీడియో వీవింగ్ టీమ్లను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పరిశీలిస్తాయి. అంతే కాకుండా పార్లమెంట్ పరిధిలో 23 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆధారాలు లేకుండా రూ. 50వేల కంటే ఎక్కువ నగదును రవాణా చేస్తే సీజ్ చేయనున్నారు. బంగారం, వెండి, ఇతర గిఫ్ట్ల రవాణాపై నిఘా పెట్టారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచి ఖర్చు పరిగణనలోకి వస్తుంది. రాష్ట్రంలో అభ్యర్థి వ్యయ పరిమితి రూ. 95లక్షలుగా నిర్ణయించారు