సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. కోడ్ అమలులో ఉండటంతో అన్ని రకాల వ్యవహారాలపై నజర్ పెట్టింది. బ్యాంక్ లావాదేవీలు, ఆన్లైన్ చెల్లింపులపై నిఘా పెంచింది. ప్రచార ఖర్చులు, కోడ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించింది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా ఖాతాలపై కన్నేసింది. ఇటీవల తొలి ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా సిబ్బందిని నియమించింది.
ప్రచార ఖర్చు, కోడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక బృందాలను నియమించారు. పార్లమెంట్ పరిధిలోని వివిధ సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. మొత్తంగా 23 చెక్ పోస్టులు పెట్టారు. మద్యం, నగదు రవాణాపై నిఘా పెంచారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా రూ.50వేల మించి నగదు రవాణా చేస్తే సీజ్ చేస్తున్నారు. బంగారం రవాణా చేస్తే బిల్లులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈసారి బ్యాంక్ లావాదేవీలు, ఆన్లైన్ చెల్లింపులపైనా దృష్టి పెట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రూ.50వేల కంటే ఎక్కువగా చెల్లింపులు జరిగితే సమాచారం ఇవ్వాలని ఎన్నికల అధికారులు బ్యాంకులను ఆదేశించారు. మరోవైపు సోషల్ మీడియా ఖాతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు.
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు ఉండనున్నాయి. కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పటికే వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్లను తొలగించారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మే 13న పోలింగ్ జరుగనుంది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారిగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ వ్యవహరించనున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో భువనగిరి, జనగాం, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజవకర్గాలు ఉన్నాయి. వీటిన్నింటి కార్యకలాపాలు భువనగిరి కేంద్రంగానే జరగనున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ కూడా భువనగిరి జిల్లాకేంద్రంలోని అరోరా కాలేజీలో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.
పార్లమెంట్ పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఈసారి కూడా ఇదే తరహాలో పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు, ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. ఓటుపై యువతకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్ దాఖలు వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం 18,00,398 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3,37,389 మంది ఉన్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం ఉన్నతాధికారులకు వివిధ రకాల బృందాలను ఏర్పాటు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు 54టీమ్లు, ఫ్లయింగ్ సర్వైలైన్స్ టీమ్లు 23, స్టాటిస్టిక్ సర్వైలైన్స్ టీమ్లు 23, వీడియో వ్యూయింగ్ బృందాలు తొమ్మిదింటిని నియమించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన వెబ్క్యాస్టింగ్, రూట్, సెక్టోరియల్, పోలింగ్, ఇతర సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు.
పోలింగ్ సిబ్బంది కోసం మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా 1.052 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1054 ఏపీఓలు, 2156 ఓపీఓలను నియమించారు. మహిళలు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సౌకర్యవంతంగా మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మౌలి సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను గోదాముల్లో సిద్ధంగా ఉంచారు.