నల్లగొండ, ఏప్రిల్ 18 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోపాటు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వివిధ పార్టీల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థితోపాటు నలుగురిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతిచ్చారు.
తొలిరోజు రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ రెండు నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్గౌడ్ ఒక సెట్ నామినేషన్ అందజేశారు. అలాగే సోషలిస్టు పార్టీ(ఇండియా) నుంచి రచ్చ సుభద్రారెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సెలవు రోజులు మినహా ఈ నెల 25 వరకు నామినేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉంది.