నల్లగొండ ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేస్తూ ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగా నాలుగో విడుతలో రాష్ట్రంలో పోలింగ్ జరుగనున్నది. వచ్చే నెల 18న నోటిఫికేషన్ వెలువరించి అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.
పరిశీలన, ఉపసంహరణ అనంతరం 29న అభ్యర్ధుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత సరిగ్గా 14 రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను త్వరగా తేల్చితే ఆయా రాజకీయ పార్టీల ప్రచారానికి కావాల్సినంత సమయం దొరుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్తోపాటే ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రాగా, పకడ్బందీగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల సమర భేరీ మోగింది. మొత్తం 7 దశల్లో దేశమంతటా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ప్రకటించింది. నాలుగో విడుతలో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నల్లగొండ లోక్సభ స్థానానికి నల్లగొండలో, భువనగిరి లోక్సభ స్థానానికి భువనగిరిలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
మర్నాడు పరిశీలన చేస్తారు. 29 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తూ అదేరోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు. ఆ రోజు నుంచి సరిగ్గా 12 రోజులు ప్రచారానికి గడవు ఉంటుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. అనంతరం స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంలను భద్రపరిచి జూన్ 4న దేశవ్యాప్తంగా ఒకేసారి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూన్ 6 వరకు ఎన్నికల ప్రక్రియ ముగియనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, నల్లగొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 17,18,954 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు.
ఇప్పటికే లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న రాజకీయ పార్టీలు మరింత దూకుడును ప్రదర్శించనున్నాయి. అభ్యర్థుల ఎంపికపైన సందిగ్ధత కొనసాగుతుంది. బీజేపీ ఇప్పటికే నల్లగొండకు శానంపూడి సైదిరెడ్డిని, భువనగిరికి డాక్టర్ బూర నర్సయ్యను తమ అభ్యర్థులుగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నల్లగొండకు కుందూరు రఘువీర్రెడ్డిని ప్రకటించి భువనగిరిపై సస్పెన్స్ను కొనసాగిస్తున్నది.
ఇక బీఆర్ఎస్ అభ్యర్థులపై త్వరలోనే స్పష్టత రానున్నది. భువనగిరి నుంచి సీపీఎం కూడా బరిలో నిలువనున్నట్లు ప్రకటించింది. మిగతా పార్టీలు కూడా కసరత్తును ముమ్మరం చేస్తున్నా రెండు లోక్సభ స్థానాల్లోనూ ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉండనున్నది. అభ్యర్థ్దుల ఎంపికపై స్పష్టత వస్తే ప్రచారానికి కావాల్సినంత సమయం దొరకనున్నది. కాగా, గత ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థులపై విజయం సాధించారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, మంత్రుల అధికారిక పర్యటనలకు బ్రేక్ పడింది. దాదాపు 82 రోజుల పాటు సుదీర్ఘంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండనున్నది. గతంలో ఎన్నడూ ఇంత కాలం కొడ్ కొనసాగిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు. కోడ్ అమలులోకి రావడంతో ఎక్కడికక్కడ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు పలు బృందాలు విధుల్లో ఉండనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు, ప్రచార సామగ్రిని తక్షణమే తొలగించేలా రంగంలోకి దిగారు. నగదు బదిలీ, రవాణాపై తీవ్ర ఆంక్షలు కొనసాగనున్నాయి.