యాదగిరిగుట్ట, జూన్17: మండలానికి మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి డిమాండ్ చేశారు. మల్లాపురం గ్రామంలోని సర్వే నంబర్ 64లో రూ.183 కోట్లతో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి పేరిట మంజూరైన ఎంబీబీఎస్ కళాశాల, 300 పడకల ఆసుపత్రిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టతనిచ్చి వెంటనే పనులను ప్రారంభించాలని కోరారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లాపురం గ్రామంలో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పోలీసులతో దీక్షను భగ్నం చేయడమే కాకుండా గ్రామంలో యుద్ధవాతావరణం నెలకొల్పారని ఆరోపించారు.
మల్లాపురం గ్రామ మహిళలు ఎమ్మెల్యేను ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారన్నారు. వైద్య కళాశాల యాదగిరిగుట్ట మండలంలోనే నిర్మిస్తారా.. లేక భువనగిరికి తరలిపోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కానుగు బాలరాజు,మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ ముక్యర్ల మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు బందారపు బిక్షపతి, ఎరుకల హేమేందర్గౌడ్ తదితరులు బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగడం సరి కాదన్నారు. ఎమ్మెల్యే ఇప్పటి వరకు యాదగిరిగుట్ట పట్టణంలో చేపట్టిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హాయాంలో మంజూరైన పనులకు తిరిగి శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది శూన్యమని అన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా, ప్రశ్నించినవారిపై దాడికి పాల్పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాండవుల భాస్కర్గౌడ్, ఆరె శ్రీధర్, గుండ్లపల్లి వెంకటేశ్గౌడ్, వాసం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.