పెన్పహాడ్, డిసెంబర్ 22 : సమీకృత వ్యవసాయానికి పామాయిల్ తోటలు ఎంతో ఉపయోగకరమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.శ్రీధర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మాచారంలో సాగు చేసిన పామాయిల్ తోటలను సందర్శించి మాట్లాడారు. పామాయిల్ తోటలు ఏపుగా, ఆరోగ్యంగా పెరిగేందుకు శాస్త్రవేత్తల సలహాలతోపాటు ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. అంతేకాకుండా యాసంగిలో అనువైన అంతర పంటలుగా పుచ్చ, దోస, పచ్చిమిర్చి, వేరుశనగ సాగు చేయవచ్చని తెలిపారు. నీటి వసతి ఉన్న రైతులు పామాయిల్ తోటలు సాగు చేసి ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారి జగన్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, తూముల ఇంద్రసేనారావు, ముదిరెడ్డి వెంకట్రెడ్డి, లింగయ్య, సైదులు పాల్గొన్నారు.