రెండో రోజూ ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి
వీధులు, పాఠశాలలు శుభ్రం
పారిశుధ్యం, ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన
హుజూర్నగర్లో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి
నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల భాగస్వామ్యం
సూర్యాపేట, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండో రోజు ముమ్మరంగా కొనసాగాయి. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. పట్టణాలు, పల్లెల్లో ప్రజాప్రతినిధులు జిల్లా, మండల స్థాయి అధికారులు, పల్లె ప్రగతి కమిటీలు, స్టాండింగ్ కమిటీల సభ్యులు పర్యటించి మురుగు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకుడు గుంతల నిర్మాణాలతో ప్రయోజనం, ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై వివరిస్తూ వీధులు, మురుగు కాల్వలను శుభ్రపర్చారు. కంప చెట్లను తొలగించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని అమరవరంలో జరిగిన పల్లెప్రగతిలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికాయుగంధర్రావు, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. కోదాడ మున్సిపాలిటీలో జరిగిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, నేరేడుచర్లలో జడ్పీ సీఈఓ సురేశ్ పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి, పోల్యానాయక్ తండాలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని వైకుంఠధామాలను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామ సభలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. రాజాపేట మండలం చల్లూరు, రఘునాథపురం గ్రామాల్లో జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి పర్యటించి పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధి కోమటికుంటలో రోడ్ల వెంట కంపచెట్లను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది