నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రానున్నది. ఇప్పటి వరకు ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తప్పని సరైంది. ఎన్నికల సంఘం (మొదటి పేజీ తరువాయి) నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నది.
2021 మార్చి 29 నుంచి ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2015 ఎన్నికల్లో తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. రెండోసారి కూడా బీఆర్ఎస్ నుంచి పల్లాకే అధినేత అవకాశం కల్పించారు. దీంతో 2021 మార్చి 14న జరిగిన పోలింగ్లో పల్లా రాజేశ్వర్రెడ్డి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 సంవత్సరాల 9 నెలల పాటు శాసనమండలి సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించారు.
ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో అనివార్యంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆదివారం తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి అందజేయడంతో ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రానున్న మూడు నాలుగు నెలల్లో మిగిలిన 3 సంవత్సరాల మూడు నెలల పదవీ కాలం కోసం ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల సందడి నెలకొననుంది.