సాగు ఆరంభం నుంచి పంట అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవడంలో రాష్ట్ర సర్కార్ తనకు తానే సాటని మరోసారి చాటిచెపుతున్నది. ప్రస్తుత యాసంగిలో మార్కెట్కు వచ్చిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు చకచకా ఏర్పాటవుతున్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమవగా యాదాద్రి జిల్లాలో బుధవారం నుంచి షురూ కానున్నాయి. మొత్తం 873 కేంద్రాల ద్వారా 19లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే లక్ష్యంతో ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 13.48లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
32.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అధికారుల అంచనా. ఇందులో 13.50లక్షల మెట్రిక్ టన్నులు విత్తనాలు, రైతుల అవసరాలకు పోగా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే వారం రోజుల్లో పూర్తి స్థాయిలో కేంద్రాలన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి జగదీశ్రెడ్డి ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా వేగవంతంగా కొనుగోళ్లు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్17(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఈ నెల 10న సీఎం కేసీఆర్ ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం ధాన్యం రాకకు అనుగుణంగా ప్రాధాన్యత ప్రకారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అదనపు కలెక్టర్ల సారథ్యంలో పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, సహకార, మార్కెటింగ్శాఖ అధికారులు సమన్వయంతో కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 272 కేంద్రాలకు గానూ 190 కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 284 కేంద్రాలకు గానూ 216 కేంద్రాలు ప్రారంభించారు.
యాదాద్రి జిల్లాలో 317 కేంద్రాలను లక్ష్యంగా పెట్టుకొని రేపటి నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. దాంతో పాటు కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ బ్యాగులు, కాంటాలు, తేమ యంత్రాలు, ఇతర సామగ్రిని కూడా సమకూరుస్తున్నారు. ధాన్యం కాంటా వేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసేందుకు అపరేటర్లకు ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశారు. వెంటనే అప్లోడ్ చేస్తూ వేగవంతంగా రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక కాంటా అయిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేలా ట్రాన్స్పోర్టు య్రంతాంగాన్ని అప్రమత్తం చేశారు. అదేవిదంగా రైసుమిల్లర్లతో సమావేశం నిర్వహించి ఎప్పటికపుడు దిగుమతి చేసుకునేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ్దతో ఎమ్మెల్యేలు, కలెక్టర్లను సమన్వయం చేస్తూ ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నారు.
19 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా
ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 5.56 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా 13.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో సన్నాలు, విత్తనాలు, రైతుల అవసరాలకు 6.72 లక్షలు పోతే మిగతా 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లకు వస్తుందని అంచనా. సూర్యాపేట జిల్లాలో 4.75 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా 12.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో స్థానిక అవసరాలకు 5.13 లక్షలు పోతే మిగతా 7.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని భావిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో యాసంగి వరి సాగు కాగా 6.09 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 1.09 లక్షల మెట్రిక్ టన్నులు స్థానిక అవసరాలకు పోగా మిగతా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటికి అనుగుణంగా అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
నాణ్యతపై ప్రత్యేక దృష్టి
కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ పెడుతున్న కొర్రీల నేపథ్యంలో ధాన్యాన్ని సరిగ్గా ఎండబెట్టి, మట్టి పెడ్డలు, తాలు లేకుండా తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. అలా కాని పక్షంలో ధాన్యాన్ని రారైస్గా మార్చే క్రమంలో బియ్యం విరిగి ఎక్కువగా నూకలు వస్తాయి. దాంతో ఎఫ్సీఐ సీఎంఆర్ సేకరణలో ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాణ్యమైన ధాన్యం తెచ్చేలాల రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టారు.
వేగవంతంగా సాగేలా
ఒకసారి కొనుగోళ్లు ప్రారంభించాక ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే రైస్ మిల్లర్లతో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లతో, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో అధికారులు పలుదఫాలుగా సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఇక గన్నీ బ్యాగుల సేకరణకు కూడా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
సరిహద్దుల్లో నిఘా
మన పొరుగున ఉన్న ఏపీతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ఏపీ సరిహద్దుల్లోని అన్ని రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ధాన్యం లోడ్లతో వస్తున్న లారీలను అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. దీని వల్ల జిల్లా రైతులకు మద్దతు ధర లభిస్తున్నది. యాసంగిలో పండిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలన్న సంకల్పంతో పకడ్బందీగా చర్యలు కొనసాగుతున్నాయి.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్
మాల్, ఏప్రిల్ 17 : చివరి ధాన్యం గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంతో పాటు తీదేడులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోవద్దనే రాష్ట్రంలో యుద్దప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించిందన్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారుల అంచనా ప్రకారం ఈ యాసంగిలో అధికంగా వరిసాగైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానిని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభించిందన్నారు.
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ కంకణాల ప్రవీణ, ఎంపీపీ కొండూరి భవానీపవన్కుమార్, తాసీల్దార్ విశాలాక్షి, ఎంపీడీఓ రాజు, మండల వ్యవసాయాధికారి రామలింగేశ్వర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, నాయకులు విద్యాసాగర్రావు, శ్రీనివాస్రెడ్డి, కిష్టారెడ్డి, నరేందర్రావు, మర్రు రామారావు, కొప్పుల రాములు పాల్గొన్నారు.