ఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును మంగళవారం (28న) ప్రకటించనుండగా సెలక్టర్లకు ప్రధాన ఆటగాళ్ల ఫిట్నెస్ చిక్కులు కొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి. ఇంగ్లండ్ పర్యటనలో గాయాలపాలైన స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్కు అనుమానమే అని బీసీసీఐ సీవోఈ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరూ పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో తొలి టెస్టుకు వీరిని ఎంపికచేయడం కష్టమేనని తెలుస్తున్నది. ఫస్ట్ టెస్ట్ మిస్ అయితే మిగిలే ఏకైక టెస్టుకైనా వీరిని సెలక్ట్ చేయాలా? వద్దా? అన్నదానిపై సెలక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.
వీరితో పాటు మరో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా సైతం లంకతో సిరీస్కు అందుబాటులో ఉండరని సీవోఈ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జట్టులో నాలుగో స్పిన్నర్గా మానవ్ సుతార్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్లలో ఎవరో ఒకరికి చోటు దక్కే అవకాశం కనిపిస్తున్నది. ఆల్రౌండర్లకు ప్రాధాన్యమిచ్చే గంభీర్.. సుతార్, సారాంశ్లలో ఎవరికి ఓటు వేయనున్నాడన్నది త్వరలో తేలనుంది. ఇక బుమ్రా ఈ సిరీస్కు గైర్హాజరీ అయితే సిరాజ్కు అండగా గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ భారాన్ని మోయనున్నారు.