యాదగిరిగుట్ట, జనవరి 29 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట (పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు సాంప్రదాయరీతిలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం స్వామివారి నిత్యారాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం, సాయంత్రం పరమపద ఉత్సవం పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్ సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో భాజాభజంత్రీలతో స్వామివారి సేవను ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధానం చేశారు.
ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్భాల భాస్కరశర్మ, ఆలయ ప్రధానార్చకుడు మోహనాచార్యులు, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. కాగా, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడ్రోజులుగా జరుగుతున్న అధ్యయనోత్సవాలు సోమవారం పరిపూర్ణం కానున్నాయి. సోమవారం ఉదయం నూత్తందారి చాత్మరా ఉత్సవంతో ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు.
పరమ పదోత్సవ
భగవానుడి నిత్య నివాస స్థానమైన వైకుంఠానికి పరమపదం అనే విలక్షణమైన నిత్యనివాస స్థానం. పరమాత్మది మాయాతీతం.. అనగా కేవలం శుద్ధ, సత్య ప్రకాశం నిత్యముక్తుల చేత సంసేవ్యమానం అని అర్థం. శ్రీ, భూ, నీళాది దివ్యపత్ని సమేతుడై దక్షిణముఖంగా అనంత శయనాసీనుడై మణిమయ సహస్ర స్తంభ శోభితమైన భగవంతుని దివ్య దర్శనమే పరమపదనాథుడి దర్శనం. భగవత్ రామానుజులు పరమపదనాథుడిని ప్రస్తుతిస్తూ ప్రేమాతిశయం కలిగిన జగత్కారక తత్వమే ఈ స్వరూపం అని పలు విధాలుగా స్తుతించారు. భగవద్ అనుగ్రహం మోక్షం పొందిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలిగించు ఈ పరమపదనాథుడి ఆళ్వారాదుల ప్రబంధాలలో భక్తకోటికి నయనానందం కలిగిస్తుంది. తత్వంగా దర్శన భాగ్యం కలిగిస్తుంది. పరమ పదనాధుడి ముక్తి ప్రదం అని దివ్య ప్రబంధ సారాంశం.