8వ విడుత హరితహారానికి సర్వం సిద్ధం
టార్గెట్ 28 లక్షల మొక్కలు
బృహత్ పల్లెప్రకృతి వనాలే లక్ష్యం
శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించిన జిల్లా కలెక్టర్
అన్ని ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
ఇప్పటికే పలుచోట్ల ప్లాంటేషన్ ప్రారంభం
ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే నర్సరీల్లో 49.11 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచింది. ప్రభుత్వం శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు కూలీలతో గుంతలు తీయించే పనులు చేయిస్తున్నారు. నాటిన మొక్కల్లో 95 శాతం బతికేలా చర్యలు తీసుకోనున్నారు. ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపులా, కార్యాలయాల సముదాయాలు, విద్యాసంస్థల అవరణల్లో ఇప్పటికే ఏడు విడుతల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో మొక్కలను సంరక్షిస్తున్నారు. ఈ సారి 15 రకాల మొక్కలు నాటనుండగా అందులో పండ్లు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలు కూడా ఉండనున్నాయి. ఈ సారి బృహత్ పల్లెప్రకృతి వనాలలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయనున్నారు.
యాదాద్రి, జూన్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు ఏడు విడుతలు పూర్తికాగా, ఆయా విడుతల్లో నాటిన మొక్కలను సంరక్షించి, పుడమితల్లికి పచ్చలహారం వేసి స్ఫూర్తిగా నిలిచింది. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, జిల్లా యంత్రాంగం అందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మొక్కలు నాటిన వారికే సంరక్షణ బాధ్యతలు అప్పగించేలా ప్రణాళికలు రూపొందించింది. ఎనిమిదో విడుతలో జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలోని 418 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. ఉపాధిహామీ పథకంలో గ్రామ వన నర్సరీలను ఏర్పాటు చేసి.. పండ్లు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాలు వంటి 15 రకాల మొక్కలను పెంచుతున్నారు. ఇందులో గుల్మొహర్, రేల, చింత, వేప, దానిమ్మ, మునగ, బొప్పాయి, సీమ తంగేడు, గులాబీ, గన్నేరు, మందార, పల్లె, చామంతి, కానుగ, తులసి, బూరుగు, పెల్టోఫాం, స్పటోడియా వంటి మొక్కలు ఉన్నాయి. ఒక్కో నర్సరీలో 8 వేల నుంచి 20 వేల మొక్కలను పెంచుతున్నారు.
అందుబాటులో 49.11 లక్షల మొక్కలు..
ఎనిమిదో విడుత హరితహారంలో వివిధ శాఖల ద్వారా జిల్లావ్యాప్తంగా 28 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ పమేలా సత్పతి లక్ష్యాన్ని నిర్దేశించారు. శాఖల వారీగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు మొక్కలు నాటే ప్రదేశాలను ముందుగానే గుర్తించి, నిర్ధిష్టమైన హరిత ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అయితే.. జిల్లాలో లక్ష్యానికి మించి మొక్కలు పెంచుతున్నారు. 418 నర్సరీల్లో 49.11 లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, అధికారులు, సిబ్బందికి అప్పగించనున్నారు. నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాలే లక్ష్యం..
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికల నిర్మాణాలు జరిగాయి. గ్రామీణ ప్రజలు సేద తీరేందుకు పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల ఔషధ, పూలు, పండ్ల మొక్కలను నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. జిల్లాలో ఇప్పటికే 10 గ్రామాల్లో పూర్తి చేశారు. వీటిల్లో 5 నుంచి 10 రకాల మొక్కలను 1,54,702 వరకు నాటారు. 8వ విడుత హరితహారంలో ఒక్కో మండలంలో 5 గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. వాటిల్లో విరివిగా మొక్కలు నాటి వాటిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు.