ఆత్మకూరు(ఎం) మండలంలో సిద్ధం
గ్రామ నర్సరీల్లో 2 లక్షలు, అటవీ శాఖ నర్సరీలో 40 వేలు..
ఆత్మకూరు(ఎం), జూన్ 22 : త్వరలో చేపట్టనున్న 8వ విడుత హరితహారం కోసం మండలంలోని 23 గ్రామ నర్సరీల్లో 2 లక్షల మొక్కలు, మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 40 వేల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో మొక్కలు నా టేందుకు 6 వేల గుంతలను తీసి సిద్ధంగా ఉంచినట్లు ఏపీఓ రమేశ్ తెలిపారు.
ఇవీ మొక్కల రకాలు..
గ్రామ నర్సరీల్లో పెరుగుతున్న 2 లక్షల మొక్కల్లో కానుగు, వేప, చింత మొక్కలతోపాటు బొప్పాయి, నేరేడు, జామ పండ్ల మొక్కలు, గులాబీ, మందార, గన్నేరు, గులాబీ తదితర పూల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 40 వేల మొక్కలు ఉండగా, ఇందులో మహాగని, అల్లనేరేడు, ఉసిరి, పనాస, తబాబియా, తగోడ, రెంటి, ఎర్ర చందనం, చింత, రావి, గుల్మొహర్, సీమచింత, తాని, నెమిలినార, వేప మొక్కలు ఉన్నాయి.
అన్ని రకాల మొక్కలు సిద్ధం
హరితహారంలో భాగంగా పంపిణీ చేసేందుకు అన్ని రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మండలంలోని ఇంటింటికీ పంపిణీ చేసేందుకు 43,207 మొక్కలు, ప్రధాన వీధుల్లో నాటేందుకు 23,500 మొక్కలు, ఖాళీ స్థలాల్లో నాటేందుకు 50 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.
– ఆవుల రాములు, ఎంపీడీఓ, ఆత్మకూరు(ఎం)
పంపిణీకి సిద్ధంగా మొక్కలు
అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 15 రకాలకు చెందిన 40వేల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. రోజూ నలుగురు కూలీలతో 6 నెలలుగా మొక్కలను సంరక్షిస్తున్నాం. దాంతో అవి ఏపుగా పెరిగాయి.
– అంజిరెడ్డి, అటవీశాఖ నర్సరీ వనసేవకుడు