చివ్వెంల, జూలై 14 : నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. పంటలకు నీళ్లడిగితే బీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్ని పంటలపై చల్లాలని రేవంత్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి చుక్క నీటికి నోచుకోని సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చలువతో నీళ్లు వస్తే దాదాపు ఏడెనిమిదేండ్ల పాటు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నామన్నారు.
ప్రభుత్వం మారినంక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎట్లు ఉంటదో ఇవ్వాళ తెలిసొచ్చిందని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్ తండా ఆవాసం పందిబండ తండా గిరిజనులు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటలకు నిరసనగా బుధవారం తమ నెత్తురు తీసి పొలంలో చల్లి నిరసన వ్యక్తం చేశారు. తమ రక్తం చూసైనా కేసీఆర్ సార్ మాదిరి వెంటనే పొలాల్లో నీళ్లు పారించాలని డిమాండ్ చేశారు.
సేవాలాల్ తండా మాజీ సర్పంచ్ గుగులోతు కవితా అనిల్ ఆధ్వర్యంలో గిరిజన రైతులు తమ రక్తం తీసి పొలంలో చల్లారు. రేవంత్ అన్నట్లు రక్తంతో పంటలు పండితే పండిన పంటలను ఆయనకే పంపిస్తామని, రక్తపు కూడు తిని ఆయన మరో నాలుగు రోజలు ఎక్కువ బతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంతా తమ రక్తాన్ని పొలాల్లో చల్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుగులోతు వెంకన్న, మాన్సింగ్, బోడియా, బుజ్జి, మస్రూ పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనపై కడుపు మండిన రైతులు తమ నెత్తురు చిందించి పాలకులకు బుద్ధి చెప్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.