నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్8( నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో యూరియా కొరత లేదని, కావాల్సినంత అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంయమనం పాటించాలని సూచించారు. జిల్లాలో శుక్రవారం నాటికి 9వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వానకాలం సీజన్లో జిల్లాలోని వివిధ రకాల పంటల కోసం ఇప్పటివరకు 70వేల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నట్లు
పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో 4,005 మెట్రిక్ టన్నులు, మేలో 6,409, జూన్లో 12,016, జూలైలో 24,032, ఆగస్టులో 24,032 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరిందని తెలిపారు. ఇందులో నుంచే 9వేల మెట్రిక్ టన్నుల యూ రియా ప్రస్తుతం జిల్లాలో రైతులకు అందుబాటులో ఉందన్నారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా ఒకట్రెండు రోజుల్లో మరో 9,613 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నదని పేర్కొన్నారు. దాంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఎవ్వరూ ఆందోళనకు గురికావద్దని తెలిపారు. యూరియా లేదన్న వదంతులను నమ్మొద్దని, భవిష్యత్ అవసరాల కోసం కూడా ఇప్పుడే తీసుకెళ్లకుండా, ఎప్పటి అవసరాలకు అప్పుడే తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వరితో పాటు పత్తి పంటకు యూరియా అవసరం ఉండడంతో సహజంగానే డిమాండ్ ఉంటుందని, దానికి అనుగుణంగా యూరియా సరఫరాకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని శ్రవణ్కుమార్ వెల్లడించారు.