పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నది. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రకృతి వనాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లేదా పది ఎకరాలు ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సత్ఫలితాలు సాధించిన సర్కారు.. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీటి పారుదల శాఖ భూముల్లో దశాబ్ది సంపద వనాలు చేపడుతున్నది. రిజర్వాయర్లు, కాల్వలు, చెరువు గట్లు తదితర ప్రాంతాల్లో, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో వనాలను ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు ఆయా శాఖల సమన్వయంతో ఖాళీ ప్రదేశాలను గుర్తించారు.
యాదాద్రి ఐదు వనాల ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం సంపద వనాలను పలు కేటగిరీలుగా విభజించింది. ఎకరం వరకు ఒక విభాగం, ఎకరం నుంచి మూడెకరాల వరకు మరో విభాగం, మూడు నుంచి 20 ఎకరాల స్థలాన్ని ఇంకో విభాగంగా విభజించారు. ఆయా విభాగాన్ని బట్టి నిధులను విడుదల చేసింది. యాదాద్రి జిల్లాలో భువనగిరి, బీబీనగర్ మండలాల్లో ఐదు బ్లాక్లను ఏర్పాటు చేసింది. భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం-1, ముత్తిరెడ్డిగూడెం-2, ముత్తిరెడ్డిగూడెం-3, పెంచికల్పహడ్, బీబీనగర్ మండలంలోని కొండమడుగులో సంపద వనాలను ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్లన్నీ ఎకరం స్థలంలో ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 3,678 మొక్కలు నాటారు.
రూ.27లక్షల ఉపాధి హామీ నిధులు..
సంపద వనాల ఏర్పాటు కోసం ఉపాధి హామీ నిధులు ఉపయోగించారు. ఇందుకోసం సుమారు రూ.27లక్షలను వెచ్చించారు. పిచ్చి మొక్కల తొలగింపు, గుంతలు తీయడం, చదును చేయడం, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం తదితర కార్యక్రమాలన్నీ ఉపాధి హామీ నిధులతో చేపట్టారు. మూడు నుంచి రెండు మీటర్ల దూరంతో గుంతలు తవ్వించారు. నాటిన మొక్కలు చనిపోకుండా వాటి రక్షణకు చర్యలు తీసుకున్నారు. వీటి నిర్వహణ గ్రామపంచాయతీలే చూసుకుంటున్నాయి. అవసరమైన నిధులను హరిత నిధి నుంచి సమకూర్చుకోనున్నారు. ఇక సంపద వనాలను కాపాడేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించారు. వనాల వద్ద తోరణాలు, గేట్లను ఏర్పాటు చేశారు. వనాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గేటుతో కూడిన తోరణాలు, ఫెన్సింగ్కు రూ.14లక్షలు ఖర్చు చేశారు.
పండ్లు, కలప మొక్కలు
గ్రామపంచాయతీలకు ఆదాయమే లక్ష్యంగా పండ్లు, కలప మొక్కలను నాటారు. రెండు, మూడు సంవత్సరాల తర్వాత వీటి ద్వారా జీపీలకు సంపద రావాలనేదే ప్రభుత్వ లక్ష్యం. సీతాఫలం, రావి, చింత, నిమ్మ, మామిడి, బ్లాక్ బెర్రీ, అంజీర్, జామ, సపోట, బత్తాయి, ఉసిరి, ఈత, నేరేడు, మర్రి, నల్లమద్ది, వెదురు తదితర మొక్కలను నాటారు. వీటి ద్వారా పచ్చదనం పెరుగడంతోపాటు గ్రామాలకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. మొక్కలు పెరిగాక పండ్లు, కలపను విక్రయించనున్నారు.
గ్రామపంచాయతీలకు ఆదాయమే లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలను బలోపతం చేయాలని భావిస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దశాబ్ది సంపద వనాలను తీసుకొచ్చింది. జిల్లాలో ఉపాధి హామీ నిధులతో ఐదు వనాలను ఏర్పాటు చేశాం. ఆయా బ్లాక్లలో 3,678 మొక్కలను నాటాం. వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. రెండు, మూడేండ్లలో ఇవి పెరిగి.. గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. ఆదాయంతోపాటు పచ్చదనం కూడా మరింత పెరుగుతుంది.
– నాగిరెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా