రామగిరి, ఏప్రిల్ 24 : ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 6,566 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యమైతే అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
హాజరు కానున్న 6,566 మంది
ఈ నెల 24 నుంచి మే 4 వరకు ఓపెన్స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,566 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో 15 పరీక్ష కేంద్రాల్లో 3,525 మంది, సూర్యాపేట జిల్లాలో 11 పరీక్ష కేంద్రాల్లో 2,250 మంది పరీక్ష రాయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 పరీక్ష కేంద్రాల్లో 791మంది హాజరవుతున్నారు. అన్ని పరీక్ష కేంద్రాలకు సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్యాడ్ బృందాలను నియమించారు.
ఇలా హాజరు కావాలి
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్, పరీక్ష ప్యాడ్, పెన్, పెన్సిల్ మాత్రమే తీసుకొని రావాలని నల్లగొండ డీఈఓ బి.భిక్షపతి వెల్లడించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. నిర్ణీత సమయం తర్వాత 5 నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.