మునుగోడులో నామినేషన్ల పర్వం మొదలైంది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు విడుదల చేశారు. తొలిరోజు ఒక నామినేషన్ దాఖలైంది. నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి మారం వెంకట్రెడ్డి నామినేషన్ పత్రాలు అందించారు. శని, ఆదివారం సెలవు కావడంతో తిరిగి సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నిక ఘట్టం షురూ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రాగా.. శుక్రవారం నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల సమరం ఊపందుకున్నది. మరోవైపు నామినేషన్ల సందడి ప్రారంభమైనది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా రు. చండూరు తాసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలిరోజు ఒక నామినేషన్ దాఖలైంది. స్వతంత్ర అభ్యర్థి మారం వెంకట్రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుకు అందించారు. కాగా రెండో శని, ఆదివారం వరుసగా సెలవు రోజులు కావడంతో తిరిగి సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
అధికారుల ఏర్పాట్లు.. భారీ బందోబస్తు
నామినేషన్ల ప్రక్రియ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరు తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో టెంట్లు, బెంచీలు ఏర్పాటు చేశారు. అక్కడే నామినేషన్ పత్రాలను తీసుకుంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల అధికారులు నామపత్రాలు స్వీకరిస్తున్నారు. తాసీల్దార్ పరిసర ప్రాంతాల్లోకి ఇతరులను అనుమతించడం లేదు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో పాటు ఐదుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్డు నుంచి తాసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ముందు నుంచే రెండంచెల చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
నేడు, రేపు సెలవు..
రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవు రోజులు కావడంతో నామినేషన్ల దాఖలుకు రెండు రోజులు విరామం ఏర్పడింది. తిరిగి 10వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు, 15న పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. 6న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
చండూరు, అక్టోబర్ 07 : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి పరిశీలించారు.
ఎన్నికల నియమావళి అమలుకు మండలానికి 7 ఎంసీసీ టీమ్లు, రెండు షిప్టుల్లో 24 గంటలు పనిచేయనున్నట్లు చెప్పారు. అలాగే డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయకుండా ప్రత్యేక దృష్టిసారించినట్లు వెల్లడించారు. మండలానికి ఒక్కటి చొప్పున 7 ఫ్ల్లైయింగ్ స్కాడ్ టీమ్లు, 7 వీఎస్టీ టీమ్లు, 9 ఎస్ఎస్టీ టీమ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల సమీక్షలో భాగంగా చెక్ పోస్టులను ఎస్పీ రెమారాజేశ్వరి పరిశీలించారు.