– నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర
నీలగిరి, ఏప్రిల్ 24 : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయితీ పొందేందుకు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర కోరారు. శుక్రవారం మున్సిపల్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలు తమ ప్రాపర్టీ పన్ను బకాయిలను (arrears) పూర్తిగా చెల్లించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును తక్షణమే చెల్లించి, రాయితీ ప్రయోజనాన్ని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పన్నులు సమయానికి చెల్లించడం ద్వారా నగర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుతాయన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల నిర్వహణ, వర్షపు నీటి కాల్వల శుద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రాథమిక సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి పన్నుల వసూలు కీలకమని తెలిపారు. పౌరులందరూ ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు వాటర్ ట్యాక్స్ అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లించాల్సిందిగా కోరారు. ప్రజల సహకారం లేకుండా నగర అభివృద్ధి సాధ్యం కాదని, ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు వచ్చి పన్నులు చెల్లించడం ద్వారా నల్లగొండను మరింత పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కోరారు. పౌరులందరూ చివరి తేదీకి ముందుగానే తమ పన్నులను చెల్లించి, ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయితీని వినియోగించుకోవడంతో పాటు, నగరాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాల్సిందిగా కమిషనర్ కోరారు.