స్వరాష్ట్రంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపడుతూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది టీఎస్ ఆర్టీసీ. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల్లోనే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పండుగల సీజన్లో ప్రయాణికులకు పలు స్కీమ్లు పెట్టడంతోపాటు భద్రాచలం రాములోరి తలంబ్రాలు, సమ్మక్క-సారక్క కొంగుబంగారం, రాఖీ పండుగ లక్కీడ్రాతో ప్రయాణికులను ఆకర్షించిన ఆర్టీసీ నూతనంగా మరో కార్యక్రమం చేపట్టింది. ప్రయాణికుల చిల్లర సమస్యకు చెక్ పెట్టేలా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది.
పైలెట్ ప్రాజెక్ట్ కింద బండ్లగూడ డిపో పరిధిలో ఆన్లైన్ పేమెంట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడ సక్సెస్ కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు డిపోల్లో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. బస్సుల్లో చిల్లర లేక ప్రయాణికులు, కండక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి చిల్లర లేక నలుగురు, ఐదుగురికి కలిపి ఇస్తుండడంతో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు డిజిటల్ పేమెంట్స్ను తీసుకొస్తున్నారు. ఇది అమలైతే ప్రయాణికులకు ఆర్టీసీ ప్రయాణం మరింత సులువు కానున్నది. అంతేకాకుండా బస్సుల్లో ఆక్యూపెన్సీ రేటు పెరిగేందుకు ఉపయోగపడనున్నది.