గత బీఆర్ఎస్ సర్కార్ విద్యకు ప్రాధాన్యం కల్పించి ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఆదర్శ పాఠశాలల్లో(మోడల్ స్కూల్స్) ఆంగ్ల బోధనతో విద్య అందించడమే కాకుండా ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య అందిస్తున్నది.
దాంతో వాటిల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తుండడంతో ప్రవేశాలకు గట్టి పోటీ నెలకొంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో సీట్ల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
రామగిరి, జనవరి 11 : కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగైన వసతులతో ఆదర్శ పాఠశాలల్లో ఉచితంగా ఉత్తమ బోధన అందిస్తున్నాయి. అన్ని వసతులతో కూడిన శాశ్వత భవనాలు, క్రీడామైదానాలు, ఆటల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ సిల్స్లో శిక్షణ, పూర్తి స్థాయిలో సిబ్బంది, సీసీ కెమెరాలతో పర్యవేక్షణతోపాటు పది, ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
రోజువారీ తరగతులతోపాటు భవిష్యత్లో విద్యార్థులు స్థిరపడేలా వృత్తి విద్యా కోర్సుల్లో సైతం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. యానిమేషన్, బ్యుటీషియన్, మైక్రో ఇరిగేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, హెల్త్కేర్, వెల్నెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ వంటి వివిధ రకాల కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 32 ఆదర్శ పాఠశాలలున్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 17, సూర్యాపేట జిల్లాలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 పాఠశాలలు పని చేస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరో తరగతిలో వందశాతం సీట్లతోపాటు 7 నుంచి 10వ తరగతిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. కాగా, నేటి నుంచి ఫిబ్రవరి 22వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏప్రిల్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే ఆయా పాఠశాలల్లో సీట్ల కేటాయింపు చేస్తారు. www.telanganms. cgg.gov.inలో ప్రవేశ పరీక్షకు ఓసీ విద్యార్థులు రూ.150, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హాల్టికెట్స్ సైతం ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆదర్శ పాఠశాలల్లో సీట్ల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 22లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఉచితం యూనిఫామ్, పాఠ్య, నోటు పుస్తకాలు అందచేస్తారు. కార్పొరేట్కు దీటుగా బోధన సాగుతుండడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-భిక్షపతి, డీఈఓ, నల్లగొండ