రామగిరి, జనవరి 27: ప్రభుత్వం, విద్యాశాఖ ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను ప్రభుత్వ జీఓ ప్రకారం సకాలంలో పూర్తి చేసేందుకు నల్లగొండ జిల్లాలో విద్యాశాఖ సన్నద్ధమైంది. జీఓ ఉత్తర్వుల ప్రకారం శనివారం నుంచి ఆన్లైన్లో ఆయా అంశాలకు సంబంధించి బదిలీకు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా ఈనెల 30 వరకు పూర్తి కానుంది. అయితే ఇప్పటికే గెజిటెడ్ హెడ్మాస్టర్ పదోన్నతుల కోసం అర్హత సాధించిన టీచర్స్ సరిఫికెట్స్ పరిశీలన పూర్తిచేశారు. శుక్రవారం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు అర్హత సాధించిన టీచర్లకు ధ్రువ పత్రాల పరిశీలన పూర్తయింది. ఏమైనా సమస్యలుంటే నేరుగా డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదులకు అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా తొలి రోజు హాజరుకాని వారికి శనివారం సైతం అవకాశం కల్పించారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు అర్హత సాధించిన గణితం, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం, ఇంగ్లిష్ విభాగాల్లో సర్టిఫికెట్స్ పరిశీలన డైట్ కళాశాలలో పూర్తిచేశారు.
మార్గదర్శకాలు ఇలా..
బదిలీలకు సంబందించి లాంగ్ స్టాండింగ్లో 8 ఏండ్లుగా ఒకే స్కూల్ పనిచేస్తున్న టీచర్లు, ఒకే చోట 5 ఏండ్లు పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
– అదేవిధంగా ఫిబ్రవరి 1, 2023 నాటికి మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి సైతం బదీలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
జిల్లా విద్యాశాఖ ప్రకటించిన ఖాళీల జాబితా మేరకు వారి సమీపంలోని అనుకూలమైన ఖాళీలకుఆన్లైన్లో ఈనెల 28 నుంచి 30 వరకు ఉపాధ్యాయులంతా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన టీచర్లు వాటి హార్డ్ కాపీలను వారి కాంప్లెక్స్ హెచ్ఎం,ఎంఈఓలకు అందజేయాల్సి ఉంటుంది. వాటిని ఈనెల 31నుంచి ఫిబ్రవరి 2 వరకు పరిశీలించి డీఈఓ కార్యాలయానికి పంపిస్తారు. డీఈఓ కార్యాలయంలో ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు పరిశీలించి అక్కడ నుంచి ఆర్జేడీకి పంపిస్తారు. ఈవిధంగా అంశాల వారీగా ప్రక్రియ అంతా మార్చి 19లోగా పూర్తి కానుంది.
వెయ్యి మందికిపైగా ఉపాధ్యాయులు హాజరు..
నల్లగొండ డైట్ కళాశాలలో నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అర్హత సాధించిన జాబితాలోని టీచర్స్ 1000మందికి పైగా హాజరయ్యారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్ వివిధ విభాగాల్లో 451మంది, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం విభాగంలో 750మంది హాజరయ్యారు. ఈ ప్రక్రియకు తొలి రోజు హాజరుకానివారికి నేడు శనివారం అవకాశం కల్పించారు. జాబితా వెల్లడించిన అనంతరం ఏవైనా అభ్యంతరాలు ఉంటే డీఈఓ కార్యాలయంలో అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదులు చేసే అవకాశం సైతం కల్పించారు.
తొలి రోజు హాజరుకాని వారికి నేడు అవకాశం : భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో పదోన్నతుల కోసం జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు సర్టిఫికెట్స్ పరిశీలన పూర్తయింది. అయితే ఎవరైనా హాజరుకాకుంటే శనివారం సైతం హాజరై పరిశీలన చేసుకునే అవకాశం ఉన్నది. జిల్లాలో అర్హులైన ఉపాధ్యాయులంతా బదిలీలకు విధిగా దరఖాస్తులు చేసుకోవాలి. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో ఈనెల 28 నుంచి 30 వరకు హాజరుకావాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ బోర్డులో ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ వెరిఫికేషన్ చేయించుకోవాలి.