యాదాద్రి భువనగిరి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఆలేరు, భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలక్రుష్ణారెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తన శక్తి వంచన లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. నియోజకవర్గంలో పైళ్ల శేఖర్రెడ్డికి మంచి పేరుందని తెలిపారు. మంగళవారం పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మరోసారి గెలిస్తే.. పెండింగ్ హామీలన్నీ అమలు చేస్తారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎక్కడా లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పథకాలన్నీ నిర్వీర్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ నీటిమూటలేనని, వారు పాలించే రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఆ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేని దౌర్భాగ్య పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దారని, అంబేద్కర్, అమరుల స్తూపం స్ఫూర్తి నింపేలా ఉన్నాయన్నారు.
రెండు, మూడ్రోజుల్లో ట్రిబుల్ ఆర్ బాధితులను కలుస్తా..
తెలంగాణ రాబంధుల వశం కాకుండా ఉద్యమకారులంతా ఒక్కతాటిపైకి రావాలన్నారు. చిన్నచిన్న భేదాభిప్రాయాల, ఇగోలు పక్కనబెట్టి బీఆర్ఎస్ గెలుపు కోసం ఏకంకావాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని పీక్కతినేందుకు, దోచుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. దళిత బంధుపై ప్రతిపక్షాలు దురుద్దేశపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దశలవారీగా దళితబంధు అమలవుతుందని, దీనిపై ఎలాంటి అపోహలు అవసరంలేదని, ఎస్సీలు అధైర్యపడవద్దన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచారని గుర్తు చేశారు. బీసీ బంధుపై కూడా గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే అనేక బీసీ కులాలను ప్రభుత్వం ఆదుకుందని వివరించారు. మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ స్వచ్ఛమైన జలాలు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే ట్రిబుల్ ఆర్ బాధితులను కలుస్తానని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బుధవారం వేములకొండ నుంచి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.