యాదాద్రిలో అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు బుధవారం ఉదయం లక్ష్మీనరసింహ స్వామి శ్రీరాముడిగా, సాయంత్రం వేంకటేశ్వురుడిగా దర్శనమిచ్చారు. అలంకార సేవలను ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించడంతో భక్తులు కనులారా వీక్షించారు.
యాదాద్రి, జనవరి 4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు మూడోరోజు బుధవారం కునుల పండువగా కొనసాగాయి. స్వయంభూ నారసింహుడి నిత్యారాధనల అనంతరం ఆలయ మొదటి ప్రాకార మండపంలో తిరుప్పావై గోష్టి నిర్వహించారు. అనంతరం స్వామివారికి నవకలశ అభిషేకం, నమ్మాళ్వారుకు అభిషేకం ఘనంగా నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం శ్రీరాముడిగా, సాయంత్రం వేంకటేశ్వురుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. అలంకార సేవలను ప్రధానాలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అలంకార సేవలను కనులారా వీక్షించి తరించారు. స్వామి వారి సేవలో నాబ్ స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొని తరించారు.
అధ్యయనోత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి వారి ప్రధానాలయ ద్రావిడ ప్రబంధ సేవా కాలాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామిని వేంకటేశ్వర స్వామిగా అలంకరించి సేవను ప్రధానాలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. ఈ సేవలో భక్తులు పాల్గొ ని తరించారు. స్వామివారికి హారతినిచ్చి తీర్థప్రసాదాలు అందించారు. సన్నాయి మేళంలో అర్చకులు, పారాయణికులు, రుత్వికుల వేద మంత్రోచ్ఛారణతో ప్రధానాలయం మార్మోగింది. వేడుకల్లో ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, పర్యవేక్షకులు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
యాదాద్రీశుడిని రాచకొండ నూతన సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం యాదాద్రి కొండపైన గల వీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీపీకి కలెక్టర్ పమేలా సత్పతి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్ శర్మ స్వామివారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాచకొండ సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం యాదాద్రి ఆలయ పరిసరాలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, సీఐలు సైదయ్య, నవీన్రెడ్డి, ట్రాఫిక్ సీఐ శివశంకర్గౌడ్, వివిధ విభాగాల పోలీసు అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి వారికి నిజాభిషేకం చేశారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.17,81,394 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీరామ అలంకార సేవ ఊరేగింపులో నాబ్ స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. స్వామివారి పల్లకిని మోసి తరించారు. అనంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. వేదాశీర్వచనం ఇచ్చారు. ఆలయాధికారి రాజన్బాబు స్వామివారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా నాబ్ స్కాబ్ చైర్మన్ మాట్లాడుతూ యాదాద్రి దేవస్థానం పునర్నిర్మాణం మహాద్భుతంగా జరిగిందన్నారు. వారి వెంట పీఏసీఎస్ చైర్మన్లు ఇమ్మడి రాంరెడ్డి, మొగులగాని మల్లేశ్, గూడె బాలనర్సయ్య, సింగిరెడ్డి, నర్సింహారెడ్డి, భాస్కర్రెడ్డి ఉన్నారు.