విజ్ఞాలు తొలిగించి లోకమంతా సుభిక్షంగా ఉండాలని చూసే గణనాథుడి పూజలకు వేళయ్యింది. నేడు వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. వాడవాడలా ముస్తాబైన మండపాల్లో నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు మట్టి గణపతి విగ్రహాలనే పూజించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఆదివారం విగ్రహాలు, పత్రి, పూజా సామగ్రి కొనుగోళ్లతో మారెట్లు సందడిగా మారాయి. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యావరణ పరిరక్షణే ధ్యేయగా ప్రజలకు 10 వేల విగ్రహాలను సొంతంగా అందిస్తున్నారు. 550 పెద్దవి, 5,400 చిన్న మట్టి విగ్రహాలతోపాటు 4,300 సీడ్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు.
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 17 : మట్టి గణేశ్ మహారాజ్కీ జై అని సూర్యాపేట ముక్తకంఠంతో నినదిస్తున్నది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తొమ్మిదేండ్లుగా అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న అన్ని రకాల కార్యక్రమాల్లో యువత, అన్ని రంగాల ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమవుతూ విజయవంతం చేస్తున్నారు.
ఈ ఏడాది మంత్రి స్వతహాగా 10 వేల మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇప్పటి వరకూ 550 పెద్ద విగ్రహాలు (5 నుంచి 7 అడుగులు), 5,400 చిన్న విగ్రహాలు, సీడ్ గణపతి విగ్రహాలు 4,300 పంపిణీ చేశారు. అలాగే పలుచోట్ల మంత్రి సతీమణి సునీతాజగదీశ్రెడ్డి, నాగారం వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల మహిళలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న మంత్రి జగదీశ్రెడ్డికి ప్రజలంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.