నకిరేకల్, డిసెంబర్ 2 : తన గెలుపును కోరుతూ ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. శనివారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. తనను గెలిపించేందుకు సైనికుల్లా శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజక వర్గ వ్యాప్తంగా 86.67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఒకవైపు పోలింగ్ కొనసాగతున్నప్పటికీ సాయంత్రం ఐదున్నర గంటలకే కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయడం ద్వారా ఓటర్లు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ పెద్దలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఓటర్లు తనపై నమ్మకంతో ఓటేసినట్లు వివరించారు.
బోగస్ ప్రచారాలను నమ్మి అభిమానులు, కార్యకర్తలు మనోధైర్యం కొల్పోవద్దని సూచించారు. నియోజక వర్గ వ్యాప్తంగా జరిపిన సర్వేలో నూటికి నూరుశాతం నకిరేకల్లో బీఆర్ఎస్ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేసిన పోలీసులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.