రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య
భువనగిరి కలెక్టరేట్, మే 18 : ప్రజల హక్కులు కాపాడటం, వారి అవసరాలు తీర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, మానవ హక్కుల పరిరక్షణలపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమస్యతో ఎవరు వచ్చినా చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. మానవ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు మానవ హక్కులు, రాజ్యాంగాన్ని తప్పనిసరిగా చదువాలని సూచించారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, దీంతో తర్వాతి కాలంలో తల్లులకు చాలా ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాల వైపు మొగ్గు చూపేలా కుటుంబసభ్యులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ విషయంలో వైద్యాధికారులు ఎప్పటికప్పుడు తగు సూచనలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యాదగిరిపల్లి గ్రామంలో కల్లుగీత సొసైటీ, గ్రామవాసి నర్సింగ్గౌడ్ కేసుకు సంబంధించి ఇద్దరితో చర్చించి కేసు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. ప్రతినెలా రెండు, నాలుగో శుక్రవారాల్లో సీనియర్ సిటిజన్ల కేసులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్ల గౌరవానికి భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, పథకాల అమలు తీరుతెన్నులను చైర్మన్కు వివరించారు. అనంతరం కోర్టు ఆవరణలోని సబ్జైలును, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు, డీసీపీ నారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.