నల్లగొండ రూరల్, ఏప్రిల్ 24: ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను రైతులు అమ్ముకోవాడానికి నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా యాంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జిల్లాలో 450 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మెజార్టీ కేంద్రాలు అధికార పార్టీ నేతకు అప్పడజెప్పడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లర్లు సైతం తాలు పేరుతో ఒక్కో లోడ్కు సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు కటింగ్ పెడుతున్నారు. ‘మిల్లర్లు ధాన్యం దించుకోవడం లేదు. మాకు బస్తా 42 కేజీలు జోకమన్నారు’ అంటూ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సైతం అడ్డగోలుగా ధాన్యం జోకుతున్నారు. ఇందంతా ప్చ్.. గప్చుప్ అన్నట్లుగా జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కొనసాగుతోంది.
అధికార పార్టీ నేతలకే కేంద్రాలు..
పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలతో పాటు ఎన్డీసీఎంస్ జిల్లాలో 58 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 58 కొనుగోలు కేంద్రాల్లో 30కిపైగా కొనుగోలు కేంద్రాలు ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు అప్పజెప్పారు. దీంతో ఆయా కేంద్రాల్లో వారి ఇష్టారాజ్యం నడుస్తోంది. అధికార పార్టీ నాయకుల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తా 42 కేజీలు తూకం వేయడంతో పాటు తాలు పేరుతో మిల్లులకు వెళ్లగానే మిల్లర్లు లోడ్కు 8 నుంచి 10 క్వింటాళ్లు కటింగ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కేవలం నల్లగొండ, తిప్పర్తి మండల పరిధిలోని రెడ్డి కాలనీ, దండంపల్లి, చందనపల్లి, ఖాజీరామారం, శేశమ్మ గూడెం, పెద్ద సూరారం, ఎర్రగడ్డ గూడెం గ్రామాల్లో మ్యాక్స్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.110 ఐకేపీ కేంద్రాలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 38 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. హాక ఆధ్వర్యంలో మరో పది కేంద్రాలను ప్రారంభించారు.
కొనుగోలు కేంద్రాల్లో గందరగోళం
నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అంతా గందరగోళం నెలకొంది. ఎలాంటి సిరియల్ లేకుండా సెంటర్ నిర్వాహకులు ఇష్టానుసారంగా కాంటాలు వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నల్లగొండలోని బత్తాయి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో హమాలీలు, సెంటర్లో పని చేసేవారు వారికి నచ్చిన వారివి, వారికి కొంత ముట్టజెప్పిన వారివి కాంటాలు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హాక ఆధ్వర్యంలో లాలాయిగూడెంలో ఏర్పాటు చేసిన సెంటర్లో ఐదు రోజులు గన్నీ బ్యాగులు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గుండ్లపల్లిలో ఏర్పాటు చేసిన మ్యాక్స్ సెంటర్లోనూ ఇష్టానూసారంగా సెంటర్ నిర్వాహకులు వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మిల్లర్ల ఒత్తిడికి..అధికారులు తలొగ్గారా?
మిల్లర్ల ఒత్తిడికి అధికారుల తలొగ్గారనే ఆరోపణలున్నా యి. ఉన్నతాధికారులే అధిక తూకం వేయమని చెప్పారని సెంటర్ నిర్వాహకులు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు వాపోతున్నారు. క్వింటాల్కు ఐదు నుంచి 7 కిలోలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
తాలు పేరుతో 14 బస్తాలు కట్
నేను రసూల్పురం హాక కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోశాను. ఏఈవో మ్యాచర్ చూసి 13 ఉందని కాంటా వేశారు. 807 బస్తాలు కాంటా వేశారు. నల్లగొండలోని బాలాజీ మిల్లు వద్ద నా లోడ్ ఆగిందని నిర్వాహకులు చెప్పారు. బియ్యం శాతం 67 వస్తున్నందున బస్తాకు కిలో చొప్పున మొత్తం 14 బస్తాలు కట్ చేశారు. అధికారులు మిల్లర్లకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో తెలియాలి.
-లక్ష్మారెడ్డి, వెలుగుపల్లి, నల్లగొండ మండలం
తాలు లేకున్నా 42 కేజీ తూకం
నల్లగొండలోని సాగర్ రోడ్డులో గల బత్తాయి మార్కెట్ సెంటర్లో ధాన్యం పోశా. నా ధాన్యంలో ఎలాంటి తాలు లేకున్నా తూకం 42 కేజీలు వేశారు. తరుగు పేరుతో నాణ్యమైన ధాన్యమున్నా మాలాంటి రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు.
-మంత్రి శారద ,అనంతారం, నల్లగొండ మండలం