74వ గణతంత్ర దినోత్సవాలు సంబురంగా సాగాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించి వందనం చేశారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఊరూవాడ దేశభక్తి గీతాలు, నినాదాలతో మార్మోగాయి.
ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల విజేతలకు బహమతులు, ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాల అందజేతతో వేడుకలు కనుల పండువగా జరిగాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా జెండా పండుగను నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. పలు విభాగాల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ శాఖల లబ్ధిదారులకు చెక్కులు పంపణీ చేశారు.