మిర్యాలగూడ, మార్చి 20 : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధికి కనీసం రెండు తడులు నీరందిస్తే రెండు లక్షల ఎకరాల్లో పంట చేతికొచ్చేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో బుధవారం నీళ్లు లేక ఎండిపోయిన వరి పొలాలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారుగా 3లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారని, కాల్వకు నీరు రాక, బోరుబావులు అడుగంటిపోయి 2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న మేజర్ కాల్వల తూముల వద్ద పోలీసు బందోబస్తు పెట్టి నీరు విడుదల చేయకుండా తాగునీటి పేరుతో 12రోజులపాటు ఖమ్మం జిల్లాకు బలవంతంగా నీటిని తీసుకెళ్లారని ఆరోపించారు. అదే సమయంలో జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు నింపినట్లయితే రైతులకు చాలా మేలు జరిగేదన్నారు. ఆ సమయంలో ఒక్క రెండు తడులు అందించినా కూడా 2 లక్షల ఎకరాల్లో పంట చేతికొచ్చేదని తెలిపారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల వెన్ను విరిచారని మండిపడ్డారు.
ఒక్కొక్క ఎకరాకు రూ.30వేల చొప్పున పెట్టుబడులు పెట్టారని, పంటలు చేతికొస్తే పెట్టుబడులు పోను ఒక్కో రైతుకు ఎకరాకు రూ.40వేలు లాభాలు వచ్చేవని, పంటలు ఎండిపోవడం వల్ల ఎకరాకు రూ.70వేల నష్టం వాటిల్లిందని వాపోయారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో వసూళ్లు, దందాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఉంటే ఎండిపోతున్న పంటలను కాపాడేవారని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారులో కరువు ఉన్న పరిస్థితుల్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీరు అతి తక్కువగా ఉన్నా కూడా రెండు పర్యాయాలు పంట పొలాలకు నీరు ఇచ్చి లక్షలాది ఎకరాలను కాపాడామన్నారు. పంటలు పండితే రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే సాకుతోనే నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
గుళ్లు, గోపురాలు తిరుగడం మంచిదేగానీ, పక్కనే ఎండిపోతున్న పంట పొలాలను మంత్రి పరిశీలిస్తే రైతుల కష్టాలు తెలిసేవని తెలిపారు. మిల్లర్లతో జిల్లా మంత్రులు కుమ్మక్కు కావడంతో రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ మిల్లర్లు దోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మిల్లర్లతో మంత్రులు మాట్లాడి రైతులకు మద్దతు ధర చెల్లించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే మంత్రులను గ్రామా ల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, కరుణాకర్రెడ్డి, మట్టపల్లి సైదులుయాదవ్, హాతీరాంనాయక్, అమరావతి సైదులు, రాములుగౌడ్, మల్లేశ్గౌడ్, రమణ, మజ్జిగపు సుధాకర్రెడ్డి, ఎండీ షోయబ్ ఉన్నారు.