2023-24 సంవత్సరానికి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు అడ్మిషన్లు షురూ అయ్యాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా రాష్ట్ర ఉన్నత విద్యామండలి అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడుతల్లో అడ్మిషన్లు నిర్వహించనుండగా తొలి విడుత ఈ నెల 16నుంచి జూన్ 10వరకు చేసుకోవచ్చు. జూలై 10తో రెండు, మూడో విడుత అడ్మిషన్లు పూర్తి చేసి జూలై 17 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 83 కళాశాలల్లో 33వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 50శాతం సీట్లు మాత్రమే నిండగా ఈ పర్యాయం పూర్తిస్థాయిలో భర్తీ జరిగేనా అనేది సందేహంగా ఉంది. దోస్త్పై సందేహాలు, సూచనలకు ఎంజీయూతోపాటు అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రామగిరి, మే 16 : రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నచ్చిన యూనివర్సిటీ పరిధిలో కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతోపాటు తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారు డిగ్రీలో ఆయా కోర్సుల్లో చేరడానికి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి. దోస్త్ అడ్మిషన్లపై సందేహాలు, సూచనల కోసం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతోపాటు వర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్, ఆ సమయంలో తప్పులు జరిగితే సరిచేసుకునే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలా..
దోస్త్తో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. విద్యార్థికి నచ్చిన, అందుబాటులో ఉండే యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్తో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాయి. విద్యార్థులు తమ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. టీ-యాప్తో http://dost.cgg.gov.in వెబ్సైట్లో లాగిన్ కాగానే దోస్త్ ఐడీ, పిన్ నెంబర్ వస్తుంది. వీటిని ఉపయోగించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఓపెన్ అయిన సైట్లో యూనివర్సిటీ, కళాశాలలు, ప్రాధాన్యత క్రమంలో కోర్సుల ఎంపిక, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సిలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంచుకున్న కళాశాలకు వెళ్లి ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపించి ఫీజు
చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు ఆన్లైన్ విధానంలో యూజీ (డిగ్రీ) అడ్మిషన్లు అందుబాటులోకి తెచ్చింది. అందుకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు విద్యార్థులు 200 రూపాయలు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
ప్రతి ఏటా సగమే..
డిగ్రీ అడ్మిషన్లను పారదర్శకంగా నిర్వహించేలా ఉన్నత విద్యామండలి 2106-17 విద్యా సంవత్సరంలో దోస్త్ను అందుబాటులోకి తెచ్చింది. అంతకుముందు కొన్ని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అడ్డదారులు తొక్కాయి. విద్యార్థుల సంఖ్య నిండుగా ఉన్నట్లు చూపించాయి. ఈ తరహా అడ్మిషన్లకు అడ్డుకట్ట వేసేలా ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం దోస్త్ను ప్రారంభించింది. దీంతో బోగస్ విద్యార్థులను చేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. క్రమేపీ ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య 2016 నుంచి తగ్గుతూ వస్తుంది. 2022-23 విద్యా సంవత్సరంలో ఎంజీయూ పరిధిలో 83 కళాశాలల్లో 33వేల సీట్లు అందుబాటులో ఉండగా 16,576 మాత్రమే నిండాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం దోస్త్ తొలి విడుతలోనే పూర్తిగా నిండిపోవడం గమనార్హం.
ఉచిత సేవలు అందిస్తున్నాం
డిగ్రీలో అడ్మిషన్లకు దోస్త్ నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఉచిత సేవలు అందిస్తున్నాం. నల్లగొండలోని ఎన్జీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో హైల్ప్లైన్ సెంటర్లు అందుబాటులో ఉంచాం. విద్యార్థులు, తల్లిదండ్రులు సంప్రదించి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. యూనివర్సిటీకి అనుబంధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండు ఎయిడెడ్ కళాశాలలున్నాయి. వాటిల్లో అన్ని రకాల మౌలిక వసతులతోపాటు అత్యంత నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. నల్లగొండ ఎన్జీ, ఉమెన్స్ కాలేజీల్లో సీట్లు మొదటి విడుతలోనే నిండుతాయి.
– డాక్టర్ ఘన్శ్యాం, ఎన్జీ, ఉమెన్స్ కళాశాలల ప్రిన్సిపాల్, నల్లగొండ
డిగ్రీ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఫస్టియర్ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులంతా విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో దోస్త్ అడ్మిషన్లలో సందేహాలపై ఎంజీయూలో ప్రత్యేక హైల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఏమైనా తప్పులు జరిగితే వర్సిటీ హెల్ప్లైన్ సెంటర్కు వచ్చి సవరణ చేసుకునే అవకాశం ఉంది. సందేహాల నివృత్తికి వర్సిటీ హెల్ప్లైన్ సెంటర్స్లో గానీ, నా ఫోన్ నెంబర్ 99483 61250లో గానీ సంప్రదించవచ్చు.
– డాక్టర్ ఆకుల రవి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ఎంజీయూ