రామగిరి, జనవరి 19 : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మేంట్ కమిటీ(ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. 30 నవంబర్ 2019 తర్వాత మళ్లీ ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా ఈ నెల 29న ఎన్నికల జరుగనున్నాయి. దాంతో పాఠశాలల్లో ఎన్నికల సందడి మొదలు కానున్నది. జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో వీటి ప్రక్రియ కొనసాగనున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 3,088 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణతో నూతన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కస్తూర్బా, మోడల్, యూఆర్ఎస్, టీఎస్ఆర్ఈఐఎస్, వివిధ శాఖల గురుకుల స్కూళ్లతోపాటు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు ఓటర్లుగా ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు.
గతంలో 18 నవంబర్, 2019లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేయగా 30 నవంబర్, 2019లో ఎన్నికలు నిర్వహించి కమిటీలను ప్రకటించారు. వీటి పదవీ కాలం 30 నవంబర్, 2021తో ముగియగా కొవిడ్ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ సాగలేదని తమకు న్యాయం చేసి మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆయా కమిటీ సభ్యులు, చైర్మన్లు ప్రభుత్వానికి విన్నవించడంతో పదవీకాలం పొడగించారు. దాంతో ఆ కమిటీలు సుదీర్ఘకాలం పనిచేశాయి. తాజాగా ప్రభుత్వం మళ్లీ నూతన కమిటీల కోసం షెడ్యూల్ జారీ చేసింది.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్గా వ్యవహరిస్తారు. మరో సీనియర్ ఉపాధ్యాయులు, వార్డు/కౌన్సిలర్/ఏఎన్ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, అంగన్వాడీ కార్యకర్త ఎక్స్ అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్నికైన సభ్యులతో పాటు ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఉంటారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎన్నికైన 15 మందితో పాటు ఆరుగురు ఎక్స్
అఫీషియో సభ్యులు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులతో మొత్తం 23 మంది ఉంటారు.
ఏడో తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 29 మంది, 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో 32 మంది, హైస్కూళ్లలో మొత్తం 17 మంది సభ్యులుంటారు. ఆయా పాఠశాలల పరిధిలో విద్యావేత్త, పాఠశాల అభివృద్ధికి సహకరించే దాతలను ఎస్ఎంసీ కోఆప్షన్ సభ్యులుగా నియమించుకునే అవకాశం ఉంది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి లేదా విద్యార్థుల్లో ఇద్దర్ని కోఆప్షన్ చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ సర్పంచ్, మున్సిపల్ చైర్మన్లు సమావేశాలకు హాజరయ్యే హక్కు ఉంటుంది.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 20న ఆయా పాఠశాలల హెచ్ఎంలు నోటిఫికేషన్ జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా సిద్ధం చేసి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నెల 29న అన్ని పాఠశాలల్లో ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత సభ్యుల, ఎక్స్ అఫీషియో , చైర్మన్ ఎంపిక పూర్తి చేసి తొలి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది.
-బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ