ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు
వరంగా మారిన కేసీఆర్ కిట్, అమ్మఒడి
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా తగ్గిన మాతాశిశు మరణాల రేటు
ఇప్పటి వరకు 87,939 కిట్ల అందజేత
రూ.113.47 కోట్ల సాయం
102 వాహన సేవలపై సర్వత్రా హర్షం
ఒడిలో పండంటి బిడ్డతో సంతోషంగా కనిపిస్తున్న ఈమె పేరు బొబ్బల సౌజన్య. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన ఈమె రెండు కాన్పులు స్థానిక పీహెచ్సీలోనే చేయించుకున్నది. మొదటిసారి సుఖ ప్రసవం చేయడంతో రెండో కాన్పు కోసమూ అక్కడికే వెళ్లింది. ఈ నెల 3న వైద్యులు నార్మల్ డెలివరీ చేయగా, మగబిడ్డ పుట్టాడు. మర్నాడు డిశ్చార్జ్ సమయంలో
వైద్యాధికారులు అందించిన కేసీఆర్ కిట్ను అందుకుని 102 వాహనంలో సంతోషంగా ఇంటికి చేరుకున్నది.
యాదాద్రి, జూలై 5 : ప్రైవేట్ ఆస్పత్రుల్లో ‘కడుపు కోతలు’ కలవరపాటుకు గురిచేస్తున్న వేళ సర్కారు దవాఖానలు నిండు గర్భిణులను సాదరంగా ఆహ్వానించి సాధారణ ప్రసవంతో తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాయి. అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలతో ఉమ్మడి జిల్లాలోని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. 2017 జూన్ 4న ప్రారంభమైన కేసీఆర్ కిట్ ఈ ఐదేండ్లలో నల్లగొండ జిల్లాలో 47,360, సూర్యాపేటలో 22,342, యాదాద్రిలో 18,237 మందికి ప్రయోజనం చేకూర్చింది. అమ్మఒడిలో భాగంగా 102 వాహనాలు గర్భిణులను దవాఖానలకు తరలించడంతోపాటు ప్రసవం అనతరం తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
వైద్యానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు దవాఖానల్లో వసతులను మెరుగుపరిచింది. అధునాతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు చేరువ చేసింది. ముఖ్యంగా కాన్పుల వార్డును సకల సౌకర్యాలతో తీర్చిదిద్దింది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతోపాటు 102 అంబులెన్స్ను అందుబాటులోకి తేవడంతో కాన్పుల కోసం ప్రభుత్వ దవాఖానలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఒకప్పుడు ప్రైవేట్ దవాఖానల్లోనే ప్రసవాలు ఎక్కువగా జరిగేవి. సర్కారు దవాఖానల్లో వసతులు సక్రమంగా లేకపోవడం, అప్పటి ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ప్రసవ మరణాలు కూడా అప్పట్లో అధికంగానే ఉండేది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్పుల వార్డును కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. కేసీఆర్ కిట్ పేరుతో తల్లీబిడ్డకు అవసరమైన 16 రకాల వస్తువులను, ఆర్థిక సాయం అందిస్తున్నారు. దాంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు అమలైన నాటి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 20,576 ప్రసవాలు జరిగాయి. అందులో 18,237 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. అమ్మ ఒడి పథకం కింద 102 అంబులెన్స్లో ఇప్పటి వరకు 27,780 మంది గర్భిణులను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రసవానంతరం 12,369 మంది బాలింతలను తిరిగి సురక్షితంగా వారి ఇండ్లకు చేర్చారు.
గర్భిణులు, బాలింతలకు 102 సేవలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి పథకం గర్భిణుల పాలిట ఒక వరంలా మారింది. గతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి కాన్పుల కోసం రావాలంటే చాలా కష్టాలు పడేది. సమయానికి వాహనాలు రాకపోవడంతో ఒక్కోసారి తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఇప్పుడా పరిస్థితిలేదు. 102 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే చాలు. ఆ ప్రాంత పరిధిలో ఉన్న వాహనానికి సమాచారం వెళ్లి వెంటనే పోన్ చేసిన ప్రదేశానికి చేరుకొని వారిని వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలిస్తుంది. తిరిగి ఇంటికి చేర్చుతుంది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి యాదాద్రి జిల్లాలో 27,780 మంది గర్భిణులను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రసవానంతరం 12,369 మంది బాలింతలను తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.
తగ్గిన మాతాశిశు మరణాల రేటు..
సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం, మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. 2017 జూన్ 2న ఇది అమల్లోకి రాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో అద్భుత ఫలితాలను ఇస్తున్నది. జిల్లా కేంద్రంలో ఏరియా దవాఖానతోపాటు 21 పీహెచ్సీలు, 3 సీహెచ్సీల పరిధిలో మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. నల్లగొండ జిల్లాలో గతంలో మాతాశిశు మరణాల రేటు 45 శాతం ఉండగా.. ఇప్పుడు 27 శాతం ఉంది. అంటే గతం కంటే 18 శాతం తగ్గింది.
ప్రసవానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బాలింతలకు 16 వస్తువులతో కూడిన కిట్ను అందిస్తున్నారు. కిట్లో పుట్టిన పాప, తల్లికి అవసరమయ్యే డైపర్లు, నాప్కిన్స్, టోయ్స్, దోమ తెరలు, బేబీ పౌడర్, బేబీ ఆయిల్, బేబీ సోపులు, పిల్లలకు కావాల్సిన బట్టలు, తల్లికి కావాల్సిన శారీలు, హ్యాండ్ బ్యాగ్, టవల్, న్యాప్కిన్స్, షాంపూ, పిల్లల బొమ్మలు ఉంటాయి. కేసీఆర్ కిట్ పంపిణీతో అత్యధిక శాతం గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్న కేసీఆర్ కిట్ బాగుంది. పిల్లలకు ఉపయోగపడే అన్ని వస్తువులు అందులో ఉన్నాయి. దోమ తెరలు, సబ్బులు, నూనెలు, పౌడర్, పరువు, దుస్తులు చాలా బాగున్నాయి. కిట్లోని వస్తువులు పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేలా ఉన్నాయి. గర్భిణుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– సుప్రియ, కేకే తండా, బొమ్మలరామారం మండలం