యాదగిరిగుట్ట, జూన్ 13 : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ప్రధానాలయంలో నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామి వారి సహస్రనామార్చన చేపట్టారు. స్వామివారికి సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు.
కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చనలు చేశారు. స్వామి వారిని బంగారు పుష్పాలతో అర్చించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల వెండి మొక్కు జోడు సేవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి గురుఢ వాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వెంచేపు చేసి మాఢవీధుల్లో ఊరేగిస్తూ తిరువీధి సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం జరిపి ఆలయానికి ద్వారాబంధనం గావించారు.
ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్, శివాలయంలో చెంత గల క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉభయ దర్శనాలు నిరాటంకంగా సాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.26, 07,084 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.
గుట్టలో విష్ణు సహస్రనామ పారాయణం
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలం కరించి విష్ణు సమస్రనామ పారాయణం గావిం చారు. ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంక టాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచా ర్యులు, వేదపండితులు పాల్గొని పారాయణాలు పఠించారు.
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న ఉన్నతాధికారులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని విద్యా మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అమర్ప్రీత్ దుగ్గల్, ఉప కార్యదర్శి సుధా మీనా, సీనియర్ సలహాదారు ఇందర్జీత్ వాస్తా, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీదేవసేన, సమగ్ర శిక్ష జాయింట్ డైరక్టర్ వెంకటనరసమ్మ, ప్లానింగ్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, టెక్నికల్ ఇంజినీర్ దుర్గాప్రసాద్, అడీషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో పాటు జిల్లా అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయ స్వాగతం పలికి స్వామివారి వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు వారికి స్వామివారి ప్రసాదం అందించారు.