Yadadri | యాదగిరిగుట్ట, జూన్ 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. మంగళవారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవసేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని వీక్షించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రి తిరువారాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు సాగాయి. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ. 20,39,357 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామివారి సేవలో ప్రముఖులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పాల్గొని తరించారు. మంగళవారం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకులు స్వామివారి ప్రసాదం అందజేశారు. అలాగే నేవీ కమాండెంట్ డీఐజీ మనీశ్శర్మ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.